Nirbhaya Case Timeline : ఈ ఏడేళ్లలో జరిగిన కీలక పరిణామాలు ఇవే.. ఎట్టకేలకు ఉరికంబం..
ఏడేళ్లుగా న్యాయం కోసం కంటనీరు పెడుతూనే ఉన్న ఆ తల్లి కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది.. ఏడేళ్లుగా ఆ దోషులు తప్పించుకోవడానికి వేసిన ప్రతీ ఎత్తుగడ చిత్తయి చివరికి మృత్యు వాకిట్లోకి అడుగుపెట్టే క్షణం దగ్గరైంది. మరికొద్ది గంటల్లో.. శుక్రవారం (మార్చి 20) తెల్లవారుజామున 5.30గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడనుంది. అత్యంత దారుణానికి ఒడిగట్టి సైతం.. ప్రాణం మీద తీపితో చివరి నిమిషం వరకూ న్యాయస్థానాల చుట్టూ తిరిగిన దోషులు ఎట్టకేలకు ఉరికంబం ఎక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏడేళ్లుగా నిర్భయ కేసు సాగిన తీరు.. ఎదురైన మలుపులు.. కీలక అంశాలతో కూడిన టైమ్ లైన్ మీకోసం..
డిసెంబర్ 16 రాత్రి,2012
డిసెంబర్ 16 రాత్రి,2012, ఢిల్లీలో కదులుతున్న ఓ ప్రైవేట్ బస్సులో 23 ఏళ్ల పారామెడికల్ స్టూడెంట్పై ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మర్మాంగాల్లో ఇనుపరాడ్లను జొప్పించి పైశాచిక ఆనందం పొందారు. అత్యాచారం అనంతరం.. కదులుతున్న బస్సు నుంచి ఆమెను,అతని స్నేహితుడిని బయటకు విసిరేశారు. అనంతరం బాధితురాలు సఫ్దర్గంజ్ ఆసుపత్రిలో చేరింది. అప్పటికే ఢిల్లీ నడిబొడ్డున రేప్ విషయం దేశమంతటా పాకింది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
డిసెంబర్ 17,2012 నిందితుల గుర్తింపు
దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల కారణంగా కేసు దర్యాప్తును పోలీసుల సీరియస్గా తీసుకున్నారు. బస్ డ్రైవర్ రామ్ సింగ్,అతని సోదరు ముకేష్,వినయ్ శర్మ,పవన్ గుప్తాలను నిందితులుగా గుర్తించారు. డిసెంబర్ 18న ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 20న బాధితురాలి స్నేహితుడు పోలీసుల ఎదుట సాక్ష్యం చెప్పాడు. అతని సాక్ష్యం మేరకు ఢిల్లీలోని ఆనంద్ విహార్ బస్ టెర్మినల్లో మైనర్ అయిన నిందితుడిని డిసెంబర్ 21న పోలీసులు పట్టుకున్నారు. అదే రోజు మరో నిందితుడు అక్షయ్ ఠాకూర్ను పట్టుకునేందుకు బీహార్,హర్యానాల్లో పోలీసులు విస్తృత దాడులు చేశారు. డిసెంబర్ 22న బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో అతన్ని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. అదే రోజు ఎస్డీఎం ఆసుపత్రిలో బాధితురాలు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
డిసెంబర్ 25.. విషమించిన నిర్భయ పరిస్థితి..
డిసెంబర్ 25న నిర్భయ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు ప్రకటించారు. అదే రోజు పోలీస్ కానిస్టేబుల్ తోమర్ మృతి చెందారు. నిర్భయ ఘటనపై వెల్లువెత్తిన నిరసనలను తన విధుల్లో భాగంగా అదుపు చేసేందుకు ప్రయత్నించగా.. తోమర్ తీవ్రంగా గాయపడి.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. డిసెంబర్ 26న నిర్భయకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. పోలీసులు ఎఫ్ఐఆర్లో హత్యను కూడా నమోదు చేశారు.
జనవరి 2,2013-ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు
జనవరి 2,2013 అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అల్తమాస్ కబీర్ లైంగిక నేరాల కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ప్రారంభించారు. జనవరి 3న పోలీసులు ఐదుగురు నిందితులపై హత్య,గ్యాంగ్ రేప్,కిడ్నాప్,దోపిడీ ఆరోపణలతో చార్జిషీట్ దాఖలు చేశారు. జనవరి 17న ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. జనవరి 28న నిర్భయ కేసులో మైనర్ పాత్రను జువైనల్ జస్టిస్ బోర్డు (JJB) నిర్దారించింది. ఫిబ్రవరి 2న ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఐదుగురు నిందితులపై కేసులు నమోదు చేసింది. అలాగే జువైనల్ కోర్టు మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసింది.
మార్చి 11,2013-రామ్ సింగ్ ఆత్మహత్య
మార్చి 11,2013న నిర్భయ కేసులో నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మార్చి 22న ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్ను రిపోర్ట్ చేసేందుకు జాతీయ మీడియాకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. జులై 11న మూడు ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీలకు కూడా ఇందుకు అనుమతినిచ్చింది. అగస్టు 31న జువైనల్ బోర్డు మైనర్ నిందితుడిని దోషిగా తేల్చి మూడేళ్లు ప్రొబేషన్ హోమ్లో ఉండాల్సిందిగా శిక్ష విధించింది. సెప్టెంబర్ 10న ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముకేష్,వినయ్,అక్షయ్,పవన్లను దోషులుగా తేల్చింది. సెప్టెంబర్ 13న ఈ నలుగురికి మరణశిక్ష ఖరారు చేసింది. మార్చి 13,2014న హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును సమర్థించింది.
మార్చి 15,2014 ఇద్దరు దోషుల ఉరిశిక్షపై స్టే..
మార్చి 15,2014లో ముకేష్,పవన్ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వారికి మరణశిక్ష విధించడంపై స్టే ఇచ్చింది. ఆ తర్వాత మిగిలిన ఇద్దరి శిక్షపై కూడా స్టే ఇచ్చింది. ఏప్రిల్ 15న బాధితురాలి మరణ వాంగ్మూలాన్ని సమర్పించాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. ఫిబ్రవరి 13,2017న దోషులకు మరణశిక్షపై కొత్తగా మళ్లీ వాదనలు వినిపించాల్సిందిగా కోర్టు కోరింది. దోషులు పిటిషన్లపై మే 27న తీర్పు రిజర్వ్లో పెట్టింది. మే 5,2017న మరణశిక్షను సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. అత్యంత అరుదైన కేసుగా దీన్ని పేర్కొన్న న్యాయస్థానం.. ఈ కేసు సునామీ లాంటి షాక్ని సృష్టించిందని అభిప్రాయపడింది.
నవంబర్ 8,2017 ముకేష్ రివ్యూ పిటిషన్
దోషుల్లో ఒకరైన ముకేష్ మరణశిక్షపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. డిసెంబర్ 12న పోలీసులు ముకేష్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించారు. డిసెంబర్ 15న మరో ఇద్దరు దోషులు వినయ్ శర్మ,పవన్ గుప్తా కూడా సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. జులై 9.2018న ముగ్గురి రివ్యూ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఫిబ్రవరి.2019న నిర్భయ తల్లిదండ్రులు దోషులకు డెత్ వారెంట్ జారీ చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 10,2019న అక్షయ్ కుమార్ తన డెత్ పెనాల్టీపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. దీన్ని వ్యతిరేకిస్తూ నిర్భయ తల్లి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
జనవరి 7,2020.. దోషులకు మొదటి డెత్ వారెంట్
సుప్రీం కోర్టు అక్షయ్ కుమార్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో నలుగురు దోషులకు డెత్ వారెంట్స్ జారీ చేయాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీంతో దోషులు మిగిలిన న్యాయ అవకాశాలను కూడా ఉపయోగించుకునేలా నోటీసులు ఇవ్వాలని తీహార్ జైలు అధికారులకు ఢిల్లీ కోర్టు సూచించింది. డిసెంబర్ 19న.. ఘటన జరిగే నాటికి తాను మైనర్ని అంటూ పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. జనవరి 7న దోషులకు ఢిల్లీ పటియాలా కోర్టు మరణశిక్ష విధించింది. తీహార్ జైల్లో జనవరి 22న ఉదయం 7గంటలకు శిక్షను అమలుచేయాల్సిందిగా ఆదేశించింది.
జనవరి 9,2020 ముకేష్,వినయ్ క్యురేటివ్ పిటిషన్లు
జనవరి 9న ముకేష్ సింగ్ సుప్రీం కోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. అదే రోజు వినయ్ శర్మ కూడా క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. జనవరి 14న ముకేష్ రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. అదే రోజు సుప్రీం కోర్టు ముకేష్ సింగ్,వినయ్ శర్మ పిటిషన్లను కొట్టివేసింది. అదే రోజు(జనవరి 14)న ముకేష్ సింగ్ డెత్ వారెంట్పై ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జనవరి 15న ఢిల్లీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన ముకేష్.. క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్న కారణంగా శిక్షను వాయిదా వేయాలని కోరాడు. జనవరి 17న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ముకేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించారు.
జనవరి 18,2020 తాను మైనర్ అంటూ పవన్ గుప్తా పిటిషన్..
జనవరి 18న పవన్ గుప్తా.. ఘటన జరిగే నాటికి తాను మైనర్ అని చెబుతూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు. జనవరి 20న న్యాయస్థానం పవన్ గుప్తా పిటిషన్ను కొట్టివేసింది. తన క్షమాభిక్ష పిటిషన్ రద్దును సవాల్ చేస్తూ జనవరి 25న ముకేష్ సింగ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జనవరి 28న అక్షయ్ కుమార్ సింగ్ సుప్రీం కోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. జనవరి 29న ముకేష్ సింగ్ క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం తిరస్కరించింది. అదే రోజు మరో అక్షయ్ కుమార్ సుప్రీం కోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. అదే రోజు వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తు చేసుకున్నాడు. ఫిబ్రవరి 1న మరణశిక్షకు ఇచ్చిన డెత్ వారెంట్పై స్టే విధించాలని కోరుతూ దోషులు ఢిల్లీ కోర్టులో జనవరి 30న పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 31న పవన్ గుప్తా సుప్రీం కోర్టులో.. తన జువైనల్ పిటిషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేశాడు. అదే రోజు న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టిపారేసింది. అదే రోజు ఢిల్లీ కోర్టు మరణశిక్షను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 1న వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించారు. అదే రోజు అక్షయ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది.
ఫిబ్రవరి 1,2020 హైకోర్టులో కేంద్రం పిటిషన్
మరణశిక్షను వాయిదా వేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఫిబ్రవరి 1న కేంద్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ట్రయల్ కోర్టు ఆదేశాలను కొట్టిపారేసి.. నలుగురు దోషులకు ఒకేసారి మరణశిక్ష విధించాలని ఆదేశించింది. వారం లోగా దోషులు తమ న్యాయ అవకాశాలన్నింటిని ఉపయోగించుకునేలా చూడాలని అధికారులను ఆదేశించింది. ఫిబ్రవరి 5న రాష్ట్రపతి అక్షయ్ కుమార్ క్షమాభిక్షను తిరస్కరించారు.ఫిబ్రవరి 6న తీహార్ జైలు అధికారులు కొత్త డెత్ వారెంట్ కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 7న ఢిల్లీ కోర్టు కొత్త డెత్ వారెంట్ను రద్దు చేసింది. ఫిబ్రవరి 11న వినయ్ శర్మ తన క్షమాభిక్ష తిరస్కరణకు గురవడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు.
ఫిబ్రవరి 17,2020.. మరో డెత్ వారెంట్ జారీ
ఫిబ్రవరి 17న ఢిల్లీ హైకోర్టు మార్చి 3న దోషులను ఉరితీయాల్సిందిగా కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 20న ఈసీకి నిర్భయ దోషులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో వినయ్ శర్మ పిటిషన్ను రాష్ట్రపతికి పంపించారని ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 28న తన మరణశిక్షను యావజ్జీవ శిక్షకు కుదించాలని పవన్ గుప్తా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఫిబ్రవరి 29న మరోసారి అక్షయ్ ఠాకూర్ రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. మార్చి 2న పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. మార్చి 2న ఢిల్లీ కోర్టు మరణశిక్షపై స్టే విధించింది.
Recommended Video
మార్చి 20,2020.. ఎట్టకేలకు ఉరికంబం ఎక్కబోతున్న దోషులు
మార్చి 4న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పవన్ గుప్తా క్షమాభిక్షను తిరస్కరించారు. మార్చి 5న ఢిల్లీ కోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. మార్చి 20 ఉదయం 5.30గంటలకు ఉరితీయాల్సిందిగా ఆదేశించింది. మార్చి 16న దోషులు అంతర్జాతీయ న్యాయస్థానం(ICJ)లో మరణశిక్షపై స్టే విధించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మార్చి 18న ముకేష్ సింగ్ ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అదే రోజు అక్షయ్ ఠాకూర్ భార్య పునీతా దేవి బీహార్లోని ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. మార్చి 19న అక్షయ్ తన క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అదే రోజు సుప్రీం కోర్టు అక్షయ్ పిటిషన్ను కొట్టిపారేసింది. అటు ఢిల్లీ పటియాలా కోర్టు మరణశిక్షపై స్టే పిటిషన్ను కొట్టిపారేసింది. క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేస్తూ అక్షయ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను ఢిల్లీలో లేనని పేర్కొంటూ ముకేష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను కూడా సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. మొత్తానికి ఏడేళ్ల తర్వాత నిర్భయ దోషులకు అన్ని దారులు మూసుకుపోయాయి. ఢిల్లీ పటియాలా కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం ఈరోజు(మార్చి 20) తెల్లవారుజామున 5.30గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలుకానుంది.