తీహార్ జైలులో నిర్భయ దోషిపై అత్యాచారం, లైంగిక దాడి: న్యాయవాది సంచలన కామెంట్స్: తీర్పు రిజర్వ్..!
న్యూఢిల్లీ: పారా మెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న ముఖేష్ కుమార్ సింగ్.. తీహార్ కేంద్ర కారాగారాంలో అత్యాచారానికి, లైంగిక దాడికి గురయ్యాడట. ఈ విషయాన్ని అతని తరఫు న్యాయవాది అంజనా ప్రకాష్ వెల్లడించారు. ముఖేష్ కుమార్ సింగ్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటీషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్పై విచారణ సందర్భంగా అంజనా ప్రకాష్.. పలు కీలక, సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.
చారిత్రక అన్యాయాలను సరిచేయడానికే: పాక్లో ముస్లిమేతరులపై వివక్ష? నరేంద్ర మోడీ.. !
అత్యాచారానికి గురయ్యాడంటూ..
ముఖేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటీషన్పై జస్టిస్ భానుమతి, జస్టిస్ బొపన్న, జస్టిస్ అశోక్ భూషణ్లతో ఏర్పాటైన ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా పలు కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2013 మార్చి నుంచి తీహార్ జైలులో ఉంటూ వస్తోన్న ముఖేష్ కుమార్ సింగ్ పలుమార్లు అత్యాచారానికి గురయ్యాడని అంజనా ప్రకాష్ వెల్లడించారు. తరచూ లైంగిక దాడికి గురయ్యేవాడని అన్నారు. అలాంటి వ్యక్తిని ఉరికంబం ఎక్కించవచ్చా అని ప్రశ్నించారు.
రామ్సింగ్ను కొట్టి చంపారు..
నిర్భయపై సామూహిక అత్యాచారానికి గురైన కేసులో దోషిగా తేలిన రామ్సింగ్ ఆత్మహత్య చేసుకోలేదని, అతణ్ని కొట్టి చంపారని ముఖేష్ కుమార్ వెల్లడించినట్లు అంజనా ప్రకాష్ సుప్రీంకోర్టులో తెలిపారు. రామ్సింగ్ను తరచూ ముఖేష్ కుమార్ కళ్లముందే చితకబాదే వారని అన్నారు. ఆ దెబ్బలకు తీవ్రంగా గాయపడిన అతనికి సరైన వైద్య చికిత్సను కూడా అందజేయలేదని, ఫలితంగా - రామ్సింగ్ మరణించాడని చెప్పారు. అతను చనిపోవడాన్ని కళ్లారా చూసిన ముఖేష్ అయిదేళ్లుగా తీహార్ జైలులో నిద్రలేని రాత్రులను గడిపాడని అన్నారు.
రాష్ట్రపతి దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదంటూ..
రాష్ట్రపతి మనస్ఫూర్తిగా క్షమాభిక్ష పిటీషన్ను తిరస్కరించినట్లుగా తమకు అనిపించట్లేదని అంజనా ప్రకాష్ వ్యాఖ్యానించారు. దీనిపై ధర్మాసనం స్పందించింది. ఆయా అంశాలన్నింటినీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదంటూ ప్రశ్నించింది. తన వాదనల సందర్భంగా అంజనా ప్రకాష్ ప్రస్తావించిన పలు అంశాలపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బొపన్న ప్రశ్నలను సంధించారు. ఇవన్నీ తమ వద్ద ప్రస్తావించినప్పటికీ.. రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పిటీషన్లో ఎందుకు పొందుపరచలేదని వారు ప్రశ్నించారు.
Recommended Video
తీర్పు రిజర్వ్..
ఈ పిటీషన్పై వాదోపవాదాలను ముగించింది ధర్మాసనం. అంజనా ప్రకాష్, తుషార్ మెహతా సమర్పించిన పలు కీలక పత్రాలను పరిశీలించింది. అనంతరం తీర్పును రిజర్వ్లో ఉంచింది. బుధవారం సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించబోతోంది. నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముఖేష్ కుమార్ సింగ్ సహా వినయ్ శర్మ, పవన్ కుమార్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ ఉరిశిక్షను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. వచ్చేనెల 1వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకు తీహార్ కేంద్రకారాగారంలోని మూడో నంబర్ జైలులో ఉరిశిక్షను అమలు చేయనున్నారు.