ఉరితీతను తప్పించుకోవడానికి: మరోసారి సుప్రీంను ఆశ్రయించిన గ్యాంగ్రేప్ దోషి..!
న్యూఢిల్లీ: పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న నలుగరు కామాంధులు మృత్యువు కోరల నుంచి తప్పించుకోవడానికి చట్టపరంగా ఎన్ని మార్గాలు ఉన్నాయో.. అన్నింటినీ వినియోగిస్తున్నారు. వచ్చేనెల 3వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకు నిర్భయ దోషులకు ఉరి తీయాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వరుసబెట్టి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.
ఈ సారి తప్పించుకున్నట్టేనా?: నిర్భయ దోషుల పిటీషన్పై విచారణ మార్చి 5కు వాయిదా
చట్టపరంగా అందుబాటులో ఉన్న క్యురేటివ్ పిటీషన్, క్షమాభిక్ష పిటీషన్.. క్షమాభిక్ష పిటీషన్ను పునఃసమీక్షించాలని కోరుతూ మరో పిటీషన్.. ఇలా ఒకదాని తరువాత ఒకటిగా వరుస పిటీషన్లను దాఖలు చేస్తూ వస్తున్నారా కామాంధులు. తాజాగా- నలుగురు నిందితుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటీషన్ను దాఖలు చేశారు. తనకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా బదలాయించాలని విజ్ఙప్తి చేశాడు. ఈ పిటీషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
ఇప్పటికే ఒక పిటీషన్ వాయిదాలో ఉంది. నిర్భయ దోషులకు వచ్చేనెల 3వ తేదీన ఉరికంబాన్ని ఎక్కించాల్సి ఉండగా.. దీనిపై విచారణను సుప్రీంకోర్టు 5వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. నలుగురు నిందితులను వేర్వేరుగా ఉరిశిక్షను విధించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన పిటీషన్ అది. దానిపై తదుపరి విచారణ వచ్చేనెల 5వ తేదీకి వాయిదా పడింది. దీనితో 3న వారిని ఉరి తీస్తారా? లేదా? అనే విషయంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ పరిస్థితుల్లో పవన్ కుమార్ గుప్తా తాజాగా క్యురేటివ్ పిటీషన్ను దాఖలు చేయడం, దాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. పవన్ కుమార్ గుప్తా తరఫున న్యాయవాది ఏపీ సింగ్ ఈ క్యరేటివ్ పిటీషన్ను దాఖలు చేశారు. నిజానికి- నిర్భయ దోషులు గనక న్యాయస్థానాలను ఆశ్రయించి ఉండకపోయి ఉంటే జనవరి 22వ తేదీ నాడే వారు ఉరికొయ్యకు వేలాడి ఉండేవారు.
Recommended Video
జనవరి 22, ఫిబ్రవరి 1 తేదీల్లో వారికి ఉరిశిక్షను విధించడానికి డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ.. కార్యరూపం దాల్చలేకపోయింది. మూడోసారి డెత్ వారెంట్ జారీ అయింది. సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసులు పెండింగ్లో ఉండటంతో మూడో తేదీన ఉరి తీస్తారా? లేదా? అనేది అనుమానంగా మారింది. నలుగురినీ ఉరితీయడానికి మరోసారి తీహార్ కేంద్ర కారాగారం అధికారులు తమవంతుగా సన్నాహాలు చేస్తున్నారు. ఉరి తీయడానికి అవసరమైన ట్రయల్స్ను నిర్వహించారు.