నిర్భయ కేసు : పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన రాష్ట్రపతి
నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ను బుధవారం(మార్చి 4) రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించారు. కోవింద్ తిరస్కరణను పవన్ గుప్తా సుప్రీంలో సవాల్ చేసుకునే అవకాశం ఉంది. అది కూడా అయిపోతే న్యాయపరంగా అతను అన్ని అవకాశాలను వినియోగించుకున్నట్టే. పవన్ గుప్తా కారణంగానే మార్చి 3న అమలు జరగాల్సిన ఉరిశిక్ష వాయిదా పడింది. ఇటీవలే సుప్రీంకోర్టు పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ను కూడా తిరస్కరించిన సంగతి తెలిసిందే.
కోర్టులు తమాషా చూస్తున్నాయి: 'న్యాయం’ఎప్పుడంటూ నిర్భయ తల్లి ఆక్రోశం
ఇప్పటికే నిర్భయ దోషుల ఉరితీత మూడుసార్లు వాయిదా పడింది. నలుగురు దోషుల్లో అక్షయ్ కుమార్,వినయ్ శర్మ,ముకేశ్ కుమార్ అన్ని న్యాయ అవకాశాలను ఉపయోగించుకోగా.. ఒక్క పవన్ గుప్తా మాత్రం నిన్న మొన్నటివరకు ఎలాంటి న్యాయ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత తర్వాత.. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పెండింగ్లో ఉండటంతో మూడోసారి కూడా ఉరిశిక్ష వాయిదా పడక తప్పలేదు. తాజాగా పవన్ గుప్తా క్షమాభిక్ష కొట్టివేయడంతో కోర్టు మరోసారి కొత్త డెత్ వారెంట్లు జారీ చేసే అవకాశం ఉంది.
కాగా,2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి సమయంలో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగింది. కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు ఆమెపై గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. బాధితురాలి మర్మాంగాల్లోకి పదునైన వస్తువులను జొప్పించడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. డిసెంబర్ 29న సింగపూర్లోని ఎలిజబెత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ కేసు దోషుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదల చేశారు. మిగిలిన నలుగురికి మరణశిక్ష విధించారు.