నిర్భయ దోషుల ఉరి : అనుకోని ట్విస్ట్.. ఆరోజు ఉరితీయకపోవచ్చు..?
ఈ నెల 22న ఉదయం 7గంటలకు తీహార్ జైల్లో నిర్భయ దోషులను ఉరితీయాల్సిందిగా పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు చెప్పినట్టు 22వ తేదీన ఉరిశిక్ష అమలుచేసే అవకాశం లేదని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది.
దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నందునా.. రాష్ట్రపతి నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు వేచి చూడక తప్పదని పేర్కొంది. అంతేకాదు,జైళ్ల నిబంధన ప్రకారం.. ఒకవేళ క్షమాభిక్ష దరఖాస్తు తిరస్కరణకు గురైతే.. ఆరోజు నుంచి ఉరిశిక్ష అమలుకు 14 రోజులు గడువు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నిర్భయ దోషులను పటియాలా కోర్టు ఆదేశించినట్టుగా ఈ నెల 22న ఉరితీయలేమని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అంతకుముందు దోషుల క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.
క్షమాభిక్షపై రాష్ట్రపతి నిర్ణయం వచ్చేంతవరకు నలుగురు దోషుల్లో ఏ ఒక్కరికీ ఉరిశిక్ష అమలుచేయలేమని ఢిల్లీ ప్రభుత్వ తరుపు న్యాయవాది రాహుల్ మెహ్రా స్పష్టం చేశారు. రాష్ట్రపతి నిర్ణయం వెలువడేంతవరకు వేచి చూడక తప్పదన్నారు. దోషులు వేర్వేరుగా క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడం ఒక స్ట్రాటజీ అని అభిప్రాయపడ్డారు. తద్వారా ఉరిశిక్షను వాయిదా వేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కాగా,దోషుల క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించాల్సిందిగా నిర్భయ తల్లి ఇదివరకే రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్కి విజ్ఞప్తి చేసింది. దోషులు ఏ కోర్టును ఆశ్రయించినా సరే.. ముందుగా ప్రకటించినట్టు ఈ నెల 22వ తేదీనే వారిని ఉరితీయాలని ఆమె డిమాండ్ చేసింది.
2012లో దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. వైద్య విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు పాశవికంగా అత్యాచారం జరిపి హత్య చేశారు. 2017లో సుప్రీం కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. ఆరుగురు దోషుల్లో ఒకరైన రామ్సింగ్ జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడగా.. మరో దోషి మైనర్ కావడంతో అతనికి మరణశిక్ష నుంచి మినహాయింపునిచ్చారు.