మరోసారి కోర్టుమెట్లెక్కిన నిర్భయ దోషులు, ఈసారి కారణమిదే..? శనివారం విచారణ
నిర్భయ దోషులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. లైంగికదాడి కేసులో ఉరిశిక్ష విధించిన పాటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ క్లైయింట్కు సంబంధించి క్షమాభిక్ష పిటిషన్ అందజేయడంలో తీహర్ జైలు అధికారులు ఆలస్యం చేశారని కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను శనివారం విచారిస్తామని పాటియాలా హౌస్ కోర్టు పేర్కొన్నది.
ఇదీ కారణం..?
నిర్భయ కేసులో ఉరి శిక్ష విధించబడ్డ దోషులు వినయ్, పవన్, అక్షయ్కు సంబంధించిన క్షమాభిక్ష డాక్యుమెంట్లను తీహర్ జైలు అధికారులు ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ముగ్గురికి సంబంధించి క్యురెటివ్, మెర్సీ పిటిషన్లను దాఖలు చేయాల్సి ఉందని గుర్తుచేశారు. ఉరి శిక్ష విధించబడ్డ ముఖేశ్ కుమార్ ఒక్కరే క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ముఖేశ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.
ఏడురోజుల్లోనే..
నలుగురు నిందితులకు ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతోన్న వేళ.. మరోసారి దోషులు కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఏదైనా కేసులో దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించిన తర్వాత ఏడురోజుల్లో శిక్ష అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని బుధవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా సంగతి తెలిసిందే.
పిటిషన్లు
ఆ వెంటనే నిర్భయ దోషులు పాటియాల హౌస్ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష ఆలస్యమవుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. క్యురెటివ్, మెర్సి పిటిషన్ల పేరుతో కాలయాపన అవుతోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
ఇదీ కేసు నేపథ్యం..
2012లో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై ఆరుగురు మృగాళ్లు లైంగికదాడి చేసి, దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా.. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దోషి రామ్ సింగ్, తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. మరొకడు జువైనల్ హోం నుంచి బయటకొచ్చాడు. మరో నలుగురు దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేశ్ కుమార్ జైలులో ఉన్నారు. వీరికి కోర్టు ఉరిశిక్ష విధించగా.. రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించడంతో.. ఫిబ్రవరి 1వ తేదీన దోషులకు తీహార్ జైలులో ఉరితీయనున్నారు.