నిర్భయ దోషులేమీ ఉగ్రవాదులు కాదు.. ఇప్పటికే మూడుసార్లు ఉరితీయబడ్డారు : లాయర్ సంచలన వ్యాఖ్యలు
దేశ రాజధాని ఢిల్లీలో ఏడేళ్ల క్రితం దారుణ అత్యాచారం,హత్యకు గురైన నిర్భయ కేసులో నిందితులకు నాలుగోసారి డెత్ వారెంట్ జారీ అయింది. న్యాయ అవకాశాలు ఇంకా పూర్తి కాలేదన్న కారణంతో ఈ కేసులో ఇప్పటికి మూడుసార్లు మరణశిక్ష వాయిదా పడింది. ప్రస్తుతం దోషుల ముందు ఎలాంటి న్యాయపరమైన ఆప్షన్స్ లేకపోవడంతో తాజా డెత్ వారెంట్ అమలవడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే నిర్భయ దోషులకు జారీ చేసిన తాజా డెత్ వారెంట్పై వారి తరుపు న్యాయవాది ఏపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేలా ఉన్నాయి.
'మీడియా నుంచి ఉన్న ఒత్తిడి ఇప్పటికే ఆ నలుగురిని చంపేసింది. నాలుగు డెత్ వారెంట్లతో నాలుగుసార్లు వాళ్లు చంపబడ్డారు. ఇప్పటికే మూడుసార్లు ఉరితీయబడ్డారు. వాళ్లేమీ ఉగ్రవాదులు కారు. ఇది న్యాయ వ్యవస్థ చేస్తున్న హత్య.' అంటూ ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిప్పుతో చెలగాటమాడుతున్నట్టుగా కోర్టు పేర్కొందని.. అంటే తాను వేధింపులు,బెదిరింపులకు గురవుతున్నానని అన్నారు.
తాజా డెత్ వారెంట్ ప్రకారం దోషులను మార్చి 20,ఉదయం 5.30గంటలకు ఉరితీయనున్నారు. దోషులు న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకున్న తర్వాతే తాజా డెత్ వారెంట్ జారీ చేస్తున్నట్టు కోర్టు పేర్కొంది. అయితే దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ దాఖలు చేసిన రెండో క్షమాభిక్ష పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉందని ఏపీ సింగ్ అన్నారు. మరోవైపు తీహార్ జైలు అధికారులు మాత్రం రెండో క్షమాభిక్ష పిటిషన్పై తమకెలాంటి సమాచారం లేదని కోర్టుకు స్పష్టం చేశారు.
కాగా,2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి సమయంలో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగింది. కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు ఆమెపై గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. బాధితురాలి మర్మాంగాల్లోకి పదునైన వస్తువులను జొప్పించడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. డిసెంబర్ 29న సింగపూర్లోని ఎలిజబెత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ కేసు దోషుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదల చేశారు. మిగిలిన నలుగురికి మరణశిక్ష విధించారు.