సహనానికి పరీక్ష, న్యాయ వ్యవస్థతో ఆటలు.: నిర్భయ దోషులపై హైకోర్టులో కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై పాటియాల హౌస్ కోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై ఆదివారం విచారణ జరిగింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
ఉరిశిక్ష అమలుపై స్టే ఎత్తివేయాలంటూ..
కాగా, నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా.. ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తీహార్ జైలు అధికారులు, కేంద్ర హోంశాఖ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఉరిశిక్ష అమలుపై విధించిన స్టేను ఎత్తివేయాలని దాఖలు చేసిన పిటిషన్లపై ఆదివారం విచారణ జరిగింది.
సహనాన్ని పరీక్షిస్తున్నారు.. న్యాయవ్యవస్థతో ఆటలు..
ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు నిర్భయ దోషులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని కేంద్రం తరపు న్యాయవాది తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దోషులకు ఉరిశిక్ష ఆలస్యం కావడం వల్ల ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం పోయే ప్రమాదం ఉందన్నారు. వరుసగా పిటిషన్లు వేస్తూ ఈ నలుగురు దోషులు దేశ సహనాన్ని పరీక్షిస్తున్నారని, న్యాయవ్యవస్థతో ఆడుకుంటున్నారని కోర్టుకు తుషార్ మెహతా తెలిపారు.
నిర్భయపై అమానవీయంగా..
నిర్భయ దోషులకు వేర్వేరుగా శిక్ష అమలు చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. 2012లో నిర్భయపై ఆ నలుగురు అమానవీయంగా వ్యవహరించిన తీరు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని తుషార్ మెహతా గుర్తు చేశారు. పవన్ గుప్తా అనే దోషి ఇప్పటి వరకు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోలేదనీ.. కావాలనే ఆలస్యం చేస్తున్నాడని కోర్టుకు వివరించారు. దోషుల తరపున ఏపీ సింగ్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు ఉంచింది. కాగా, నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1నే ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా.. ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దోషులు వేసిన పిటిషన్ల విచారణ పెండింగ్లో ఉన్నందున వారికి శిక్షను అమలు చేయడం కుదరదని తెలిపింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ శిక్షను అమలు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.
పాటియాలా హౌస్ కోర్టు స్టే ఎందుకిచ్చిందంటే..
కాగా, నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై స్టే విధించిన సందర్భంగా ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు స్పందిస్తూ.. ఒకే కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషుల పట్ల వివక్ష చూపకూడదనే ఉద్దేశంతోనే ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేసింది. ఈ కారణంగానే నిర్భయ కేసులో దోషులైన ముకేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, పవన్ గుప్తాలకు ఉరిశిక్షపై స్టే విధించినట్లు తెలిపింది. ఈ మేరకు 10 పేజీలతో కూడిన ఆర్డర్ జారీ చేసింది. ‘నిర్భయ కేసులో శిక్ష నుంచి తప్పించుకునేందుకు ముకేష్ సింగ్(క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష లాంటి మిగితా అవకాశాలన్నీ తిరస్కరణకు గురయ్యాయి)కు చట్టపరంగా అన్ని దారులు మూసుకుపోయాయి. అయితే, మిగితా ముగ్గురికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. మనదేశంలోని న్యాయస్థానాలు దోషుల పట్ల ఎలాంటి వివక్ష కలిగి ఉండవు. మరణశిక్ష కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాబట్టి ముకేష్ ఒక్కడినే ఉరితీయడం సాధ్యం కాదు' అని నిర్భయ దోషలు మరణశిక్షపై స్టే ఇచ్చిన సందర్భంగా జడ్జీ ధర్మేంద్ర రానా పేర్కొన్నారు. జైలు మాన్యువల్లోని రూల్ 836 ప్రకారం.. ఒకే కేసులో ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు దోషులుగా తేలినప్పుడు, ముఖ్యంగా మరణశిక్ష ఎదుర్కొంటున్నప్పుడు ఒక దోషి లేదా ఆ కేసులో మిగిలిన దోషులంతా నేరుగా గానీ.. వారి తరపున మరెవరైనా గానీ పిటిషన్ దాఖలు చేసినట్లయితే.. ఉరిశిక్షను వాయిదా వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, దోషులు శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారన్న ఆరోపణలు పక్కనపెడితే.. దోషులకు చట్టపరంగా ఉన్న అవకాశాలను అన్నింటినీ కల్పించడం నాగరిక సమాజాకి హాల్మార్క్ వంటిదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.