నిర్భయ దోషులను తక్షణమే ఉరితీయండి, ఏడేళ్ల నుంచి పోరాటం: తల్లి ఆశాదేవి
నిర్భయ కేసు చివరి దశకు చేరుకుంది. లైంగికదాడి చేసి, హతమార్చిన నలుగురు దోషులకు ట్రయల్ కోర్టు ఉరి శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దోషి అక్షయ్ కుమార్ సింగ్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో క్యూరేటివ్ పిటిషన్ వేస్తామని, రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం 3 వారాల గడువు ఇవ్వాలని దోషుల తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మసనాన్ని కోరారు. అయితే వారం రోజుల గడువు ఇచ్చేందుకు జస్టిస్ బోపన్న, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ భానుమతితో కూడిన త్రిసభ్య ధర్మాసనం అనుమతిచ్చింది.
నిర్భయ దోషికి ఉరి తీయక తప్పదు: ఆ శిక్షకు అర్హుడే: రివ్యూ పిటీషన్ తోసిపుచ్చిన సుప్రీం
లెఫ్టినెంట్ గవర్నర్..
ఇప్పటికే ఢిల్లీ లెప్ట్నెంట్ గవర్నర్ దోషుల క్షమాభిక్ష పిటిషన్ను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. చివరగా రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పిటిషన్ తోసిపుచ్చితే నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేస్తారు. మరోవైపు నిర్భయ తల్లిదండ్రులు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మసనాన్ని కోరారు. వారికి తక్షణమే ఉరితీయాలని కోరారు. నిందితులకు ఉరి శిక్ష విధించాలని తామే కాదు ప్రజలంతా కోరుకుంటున్నారని నిర్భయ తల్లి ఆశాదేవి పేర్కొన్నారు.
14 రోజుల్లోగా..
దోషుల తరఫు న్యాయవాది క్యూరేటివ్ పిటిషన్ వేస్తానని చెప్పినందున.. గరిష్టంగా 14 రోజుల్లో దోషులకు ఉరి శిక్ష విధించాలని నిర్భయ తల్లి కోరారు. తమ కూతురికి జరిగిన అన్యాయంపై గత ఏడేళ్ల నుంచి పోరాడుతున్నామని గుర్తుచేశారు. నిర్భయ కేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మరో దోషి ముఖేశ్ సింగ్ తాను రాష్ట్రపతిని క్షమాభిక్ష పెట్టమని కోరబోనని పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే..
2012లో డిసెంబర్ 16వ తేదీని స్నేహితుడితో కలిసి వస్తోన్న యువతిని ఆరుగురు లైంగికదాడి చేసి.. బస్సుల్లోంచి పడేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. నిర్భయ దోషులను ఉరితీయాలని యావత్ భారతం నినాదిస్తోంది. ట్రయల్ కోర్టు నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించింది. దానిని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. నిర్భయ దోషులు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు క్షమాభిక్ష పెట్టుకున్నారు. ఆయన తిరస్కరించడంతో.. కేంద్ర హోంశాఖ వద్దకు ఫైలు చేరింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరిస్తే వారికి ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉంది.
నలుగురు దోషులు
నిర్భయ కేసులో మొత్తం ఆరుగురు దోషులు. రామ్ సింగ్ అనే దోషి తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో మైనర్ బాలుడు, మూడేళ్ల శిక్ష తర్వాత బెయిల్పై బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ముఖేశ్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ సింగ్ సహా మరొకరు ఉన్నారు. కేసులో నలుగురు దోషులకు ఉరి శిక్ష విధించింది. అక్షయ్ కుమార్ సింగ్ వేసిన క్షమాభిక్ష పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో త్వరలో నిర్భయ నలుగురు దోషులకు ఉరి శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.