నిర్భయ ఘటన: తీహార్ జైల్లో తీవ్ర నిరాశలో నిందితులు..డేగకన్నుతో పోలీసుల పహారా
న్యూఢిల్లీ: 2012 నిర్భయ అత్యాచార నిందితులకు ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఇక ఉరిశిక్ష అమలు చేసేందుకు సమయం దగ్గర పడుతుండటంతో నలుగురు నిందితులు నిరాశలో కూరుకుపోయినట్లు తీహార్ జైలు వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే వారు ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడకుంగా నిందితులపై గట్టి నిఘా ఉంచినట్లు తీహార్ జైలు వర్గాలు తెలిపాయి. ఒక్కో నిందితుడికి నాలుగు నుంచి ఐదుమంది పోలీసులు నిత్యం నిఘా వేసి ఉంచారని తీహార్ జైలు వర్గాలు తెలిపాయి.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్భయ తల్లిదండ్రులు
నిందితులైన అక్షయ్, ముఖేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మలు ఆహారం కూడా తీసుకోవడం తగ్గించేసినట్లు తెలుస్తోంది. ఇక నిందితులను ఉరి తీయనున్న కోర్టు నెంబర్ 3ని తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ సమీక్షించారు. నిందితులను ఉరితీసేందుకు ఏర్పాట్లపై ఆయన సమీక్ష జరిపారు. ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. 2013లో నిందితుల్లో ఒకరైన రాంసింగ్ జైలులోనే ఆత్మహత్యకు పాల్పడటంతో మిగతా నలుగురు నిందితులపై గట్టి నిఘా పెట్టారు పోలీసులు. ఇక ఘటన జరిగిన సమయంలో మరో నిందితుడు జువెనైల్ కావడంతో జువెనైల్ జస్టిస్ బోర్డు మూడేళ్లు శిక్ష విధించింది. శిక్షను పూర్తి చేసుకుని విడుదలయ్యాడు.
మరోవైపు హై ప్రొఫైల్ కేసుగా నిర్భయ అత్యాచార ఘటనను పరిగణిస్తున్న నేపథ్యంలో నిందితులున్న బారక్ వద్ద పహారాగా ఉన్న పోలీసుల ఫోన్లపై కూడా సర్వేలియన్స్ పెట్టారు. ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా ఈ జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తీహార్ జైలు అధికారులు చెప్పారు. శుక్రవారం రోజున నలుగురు నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందుంచారు. నిందితులు వీరేనంటూ జడ్జి ఆమోద ముద్ర వేశారు.
ఇదిలా ఉంటే నిర్భయ నిందితులను ఉరి తీసే అవకాశం తమకు ఇవ్వాలంటూ దేశ పౌరులు తీహార్ జైలుకు లేఖలు రాశారు. రెండు లేఖలు విదేశాల నుంచి తీహార్కు రావడం విశేషం. మరోవైపు తమిళనాడులోని రామంతపురంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎస్ సుభాష్ శ్రీనివాసన్ అనే వ్యక్తి అవకాశం ఇస్తే నిర్భయ నిందితులను ఉరి తీసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తీహార్ జైలు డీజీకి లేఖ రాశాడు.మీరట్ జైలులో ఉన్న దళారి కూడా నిర్భయ నిందితులను ఉరితీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు.