నిర్భయ డాక్యుమెంటరీ: నేను కాదని సుశీల్ కుమార్ షిండే
హైదరాబాద్: నిర్భయ డాక్యుమెంటరీ పైన మాజీ కేంద్ర హోంమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే బుధవారం స్పందించారు. ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ సామూహిక అత్యాచారం ఘటన పైన బ్రిటన్కు చెందిన దర్శకురాలు లెస్లీ ఉడ్విన్ నిర్మించిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ చిత్రానికి తాను అనుమతి ఇవ్వలేదని షిండే చెప్పారు.
సినీ నటుడు మోహన్ బాబు కుమారుడు మనోజ్ కుమార్ నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు షిండే వచ్చారు. ఓ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంగ్ల ఛానల్ విలేకరి వచ్చారు. నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ సింగ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అప్పటి హోంమంత్రిగా నిరణయం మీరే తీసుకున్నారా అని ప్రశ్నించారు.
దానికి షిండే స్పందిస్తూ... తాను అనుమతివ్వలేదని చెప్పారు. యూపీఏ హయాంలోనే దానికి అనుమతులు వచ్చాయని వార్తలొచ్చాయి. దీంతో ఈ నేపథ్యంలో ఆ విలేకరి ప్రశ్నించగా.. షిండే సమాధానం చెప్పారు. అంతలోపు మోహన్ బాబు వచ్చారు. ప్రయివేటు కార్యక్రమంలో ఇలాంటివి వద్దంటు విలేకరి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుండి పంపించారు.
కాగా, నిర్భయ ఉదంతంపై తాజాగా జరుగుతున్న వివాదం రాజ్యసభలో మహిళా ఎంపీలను ఏకం చేసిన విషయం తెలిసిందే. అసలు అత్యాచార దోషిని ఇంటర్వ్యూ చేసేందుకు ఎలా అనుమతిస్తారంటూ ప్రభుత్వాన్ని మహిళా ఎంపీలు ముక్తకంఠంతో నిలదీశారు. రాజ్యసభ మధ్యకు దూసుకువచ్చి ప్రభుత్వ చర్యను నిరసించారు.
సమాజ్వాది పార్టీ సభ్యులు జయాబచ్చన్ సారథ్యంలో పార్టీ విధేయతలకు అతీతంగా మహిళా ఎంపీలందరూ నిర్భయ డాక్యుమెంటరీ వ్యవహారంపై తమ ఆగ్రహాన్ని ఆవేదనను వ్యక్తం చేశారు. తీహార్ జైల్లోకి వెళ్లి అత్యాచార దోషిని ఇంటర్వ్యూ చేసిన ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ఇచ్చిన వివరణతో ఎంతమాత్రం సంతృప్తి చెందని మహిళా ఎంపీలు ప్రభుత్వం చేతల్లో తన నిజాయితీని నిరూపించుకోవాలని స్పష్టం చేశారు. ముఖేష్ అనే నిందితుడ్ని ఇంటర్వ్యూ చేయడానికి ఎవరు అనుమతించారన్న దానిపై దర్యాప్తు జరుగుతోందని ప్రభుత్వం ప్రకటించినా మహిళా సభ్యులు శాంతించలేదు.
అనంతరం ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు కూడా మహిళలకు మద్దతు పలికారు. దాంతో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం, పావుగంట పాటు వాయిదా పడటం జరిగింది. 267 నిబంధన కింద సభా కార్యకలాపాలను నిలిపివేసి నిర్భయ డాక్యుమెంటరీపై చర్చ జరగాలని జేడీయు సభ్యుడు కెసి త్యాగి నోటీసు ఇచ్చారు.
తీహార్ జైలు డైరెక్టర్ జనరల్పైనా, సంబంధిత ఇతర అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు, నిర్భయ దోషుల్ని త్వరితగతిన ఉరితీసేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేయాలన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నఖ్వీ దోషులెవరినీ వదిలేది లేదని, బాధ్యులైన ప్రతివారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.