తీహార్ డీజికి హోం సమన్లు, నిర్భయదే తప్పని లాయర్ తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: జైల్లో ఉన్న నిందితుడు ముఖేష్ సింగ్ను ఇంటర్వ్యూ చేసిన నిర్భయ డాక్యుమెంటరీ 'ఇండియాస్ డాటర్' అంశానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తీహార్ జైలు డీజీకి సమన్లు పంపించారు. నిర్భయ ఘటన పైన తీసిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ వివాదం నేపథ్యంలో సమన్లు పంపించారు.
అదే సమయంలో ఢిల్లీ పోలీసులు బీబీసీకి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒప్పందాన్ని ఉల్లంఘించారనే అభియోగం పైన నోటీసులు ఇచ్చారు. మరోవైపు, నిర్భయ డాక్యుమెంటరీని టీవీ, ఇంటర్నెట్లో టెలికాస్ట్ చేయవద్దన్న కేంద్రం నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది.
డిఫెన్స్ లాయర్ విచిత్ర వ్యాఖ్యలు
నిర్భయకు చెందిన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ పైన ఓ వైపు దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతుండగానే.. ఓ లాయర్ ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. జైలులో ఉన్న నిందితుడు ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూ పైన తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఇప్పుడు లాయర్ మరోసారి వివాదాస్పదంగా మాట్లాడారు.
రోడ్డు పైన స్వీట్స్ పెడితే వాటిని తినేందుకు కుక్కలు వస్తాయని, నిర్భయ తల్లిదండ్రులు ఎవరినీ తోడు పంపించకుండా ఆమెను ఎందుకు పంపించారని సదరు లాయరు అడిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరితో, ఎక్కడకు వెళ్తుందో చూసుకునే బాధ్యత తల్లిదండ్రులకు లేదా అని ప్రశ్నించాడని తెలుస్తోంది.
వారు తన ఇంటర్వ్యూ కోసం ఏడెనిమిది రోజులు తన వద్దకు వచ్చారని చెప్పారు. ఇండియన్ కల్చర్ బెస్ట్ కల్చర్ అని వారికి చెప్పానని చెప్పాడని తెలుస్తోంది.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్లో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణమైన సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి జాతీయ మీడియాలో సోమవారం సంచలనాత్మకమైన వార్తాకథనం వచ్చిన విషయం తెలిసిందే. లైంగిక దాడికి యువకుడి కన్నా యువతే ప్రధాన కారణమని నిర్భయ కేసులో నిందితుడు అన్నట్లు వార్తలు వచ్చాయి. ముకేష్ సింగ్ అనే నిందిడుతుడిని బిబిసి డాక్యుమెంటరీ కోసం జైలులో ఇంటర్వ్యూ చేశారు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.