గ్యాంగ్రేప్ దోషి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి కోవింద్..!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న వినయ్ కుమార్ శర్మ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటీషన్.. తిరస్కరణకు గురైంది. ఈ క్షమాభిక్ష పిటీషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఈ పిటీషన్ను శనివారం ఉదయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి తిప్పి పంపించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిప్పి పంపించిన క్షమాభిక్ష పిటీషన్ను ఢిల్లీ ప్రభుత్వం.. పటియాలా హౌస్ న్యాయస్థానానికి అధికారికంగ అందజేయాల్సి ఉంటుంది. ఆ తరువాతే.. ఉరిశిక్ష అమలుపై మరో డెత్ వారెంట్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
నిర్భయ దోషి క్యురేటివ్ పిటీషన్ కొట్టివేత: స్టే దరఖాస్తునూ తోసిపుచ్చిన సుప్రీం.. !
14 రోజుల తరువాతే..
ఉరిశిక్ష పడటానికి ఒక్కరోజు ముందే కిందటే వినయ్ కుమార్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటీషన్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా- శనివారం తెల్లవారు జామున 6 గంటలకు అమలు కావాల్సిన ఉరి శిక్ష వాయిదా పడింది. నిబంధనల ప్రకారం.. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించిన 14 రోజుల తరువాతే ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. కొత్తగా మరోసారి డెత్ వారెంట్ను జారీ చేయాల్సి ఉంటుందని అంటున్నారు.
ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడం రెండో సారి..
నిజానికి- నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు దోషులు వినయ్ కుమార్ శర్మ, పవన్ కుమార్ గుప్తా, అక్షయ్ కుమార్ ఠాకూర్, ముఖేష్ కుమార్ సింగ్లకు కిందటి నెల 22వ తేదీ నాడే ఉరి తీయాల్సి ఉన్నప్పటికీ.. వారిలో ఒకరు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటీషన్ను దాఖలు చేయడం వల్ల సాధ్యం కాలేదు. దీనితో రెండోసారి డెత్ వారెంట్ను జారీ చేయాల్సి వచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీన ఉరి తీయాల్సి ఉంటుందని పటియాలా హౌస్ న్యాయస్థానం డెత్ వారెంట్ ఇచ్చింది. మరో దోషి రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరడం వల్ల మళ్లీ వాయిదా పడింది.