నిర్భయ గ్యాంగ్ రేప్ తీర్పు: తల్లిదండ్రుల రియాక్షన్ ఇదీ...
తమ కూతురు గ్యాంగ్ రేప్ కేసులో నలుగురికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల నిర్భయ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులు ప్రతిస్పందించారు. నిర్భయ కేసు దోషులకు విధించిన ఉరి శిక్షను మార్చడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో నిర్భయ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇవాళ రాత్రి ప్రశాంతంగా నిద్రిస్తానని నిర్భయ తండ్రి బద్రీనాథ్ శుక్రవారంనాడు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు సంతోషాన్నిచ్చిందని అన్నారు. తమ కూతురు ఆత్మకు శాంతి ఇప్పుడు చేకూరుతుందని నిర్భయ తల్లి ఆశా దేవీ అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు తమ కుటుంబ విజయమని, తీర్పుతో తాను చాలా ఆనందంగా ఉన్నానని బద్రీనాథ్ అన్నారు. ఇది తమ విజయం మాత్రమే కాదని, అందరి విజయమని ఆశాదేవి అన్నారు.
2012, డిసెంబర్ 16న ఢిల్లీలో ఓ వైద్యవిద్యార్థినిపై గ్యాంగ్రేప్ చేసిన విషయం విదితమే. 13 రోజుల పాటు చికిత్స పొంది చివరకు తుదిశ్వాస విడిచారు. అప్పట్లో ఈ ఘటన ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో దోషులైన ముఖేశ్, వినయ్, పవన్, అక్షయ్లకు ఉరే సరి అని ఈ సందర్భంగా సుప్రీం స్పష్టంచేసింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సమర్థించింది.
బాధితురాలికి అయిన తీవ్ర గాయాలు, దోషులు తీవ్ర నేరానికి పాల్పడినందు వల్ల ఉరి శిక్ష విధించాలన్న కింది కోర్టు తీర్పును సమర్థిస్తున్నామని సుప్రీం వ్యాఖ్యానించింది. దీనిని అత్యంత అరుదైన కేసుగా ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు అభివర్ణించారు.
కోర్టు రూమ్లో ఉన్న లాయర్లు, నిర్భయ తల్లిదండ్రులు చప్పట్లతో ఈ తీర్పును స్వాగతించారు. ఈ కేసు తీవ్రతను చూస్తే ఉరి శిక్ష తప్ప ఏ శిక్ష విధించినా తక్కువే అని ఈ సందర్భంగా జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు.