నిర్భయ దోషులకు త్వరలోనే ‘ఉరి’: క్షమాభిక్ష తిరస్కరించిన ‘ఢిల్లీ’, అదే బాటలో హోంశాఖ?
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు అతి త్వరలోనే ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే, దోషులు ఒకరు పెట్టుకున్న క్షమాభిక్ష విన్నపాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తిరస్కరించే పనిలో ఉంది.
తీహార్ జైలుకు కొత్త తలనొప్పి: నిర్భయ నిందితులకు ఉరి వేసేందుకు దొరకని తలారి
అత్యంత దారుణానికి పాల్పడి క్షమాభిక్షకు..
అత్యంత దారుణానికి పాల్పడిన ఐదుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తనను ఉరిశిక్ష నుంచి తప్పించి క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు విన్నవించుకున్నాడు. ఢిల్లీ ప్రభుత్వంతోపాటు హోంమంత్రిత్వశాఖ అభిప్రాయాన్ని తీసుకుని రాష్ట్రపతి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తిరస్కరించే పనిలో హోంశాఖ..
అయితే, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిందితుడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించే పనిలో ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసిందని ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కూడా క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించాలని సిఫార్సు చేయడం గమనార్హం.
ఒక్కడు మాత్రమే క్షమాభిక్ష..
2012లో ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య చేసిన కేసులో ఐదుగురిలో నలుగురు దోషులు అక్టోబర్ 29 వరకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోలేదని జైలు అధికారులు తెలిపారు. అయితే, వినయ్ శర్మ మాత్రమే క్షమాభిక్ష పెట్టుకున్నాడని తెలిపారు. మిగితా ముగ్గురు పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముకేష్ సింగ్ మాత్రం దరఖాస్తు చేసుకోలేదన్నారు.
క్షమాభిక్షను తిరస్కరించిన ఢిల్లీ ప్రభుత్వం
కాగా, 2013 మార్చిలోనే తీహార్ జైలులో రామ్ సింగ్ అనే నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ మొదటి ఢిల్లీ ప్రభుత్వం వద్దకు వెళ్లింది. అయితే, ఇంతటి హేయమైన చర్యకు పాల్పడిన నిందితులకు క్షమాభిక్ష లేదని, ఉరితీయాల్సిందేనని అతడు పెట్టుకున్న క్షమాభిక్షను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించింది.
త్వరలోనే ఉరి..
ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫార్సు కోసం రాష్ట్రపతి వేచిచూస్తున్నారు. హోంమంత్రిత్వ శాఖకు కూడా వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించాలనే యోచనలో ఉండటంతో.. దానిని పరిగణిలోకి తీసుకుని రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేస్తే నలుగురు నిందితులకు త్వరలోనే ఉరిశిక్ష అమలు కానున్నట్లు తెలుస్తోంది.
దిశ ఘటనతో దేశ వ్యాప్తంగా..
ఇది ఇలావుండా, హైదరాబాద్లో దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను వెంటనే ఉరితీయాలంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. నిర్భయ నిందితులను కూడా వెంటనే ఉరితీయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.