మరో నిర్భయ ఘటన... కదులుతున్న బస్సులో యువతిపై రాత్రంతా గ్యాంగ్ రేప్...
ఉత్తరప్రదేశ్లో ఇటీవలి కాలంలో వరుసగా సామూహిక అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ ఘటనను తలపించేలా తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం(సెప్టెంబర్ 25) రాత్రి మీరట్లో కదులుతున్న ఓ బస్సులో ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రంతా ఆమెపై అత్యాచారం చేసి కదులుతున్న బస్సు నుంచే బయటకు విసిరేశారు.
మీరట్లోని ఢిల్లీ రోడ్డులో శనివారం ఉదయం బాధితురాలు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. తాను భైసాలి బస్టాండ్లో బస్సు ఎక్కానని చెప్పిన బాధితురాలు.. బస్సు సిబ్బంది తనకు కూల్ డ్రింగ్ ఇచ్చినట్లు తెలిపింది. అది తాగాక అపస్మారక స్థితిలోకి వెళ్లానని... ఆపై బస్సు డ్రైవర్,కండక్టర్ తనపై రాత్రంతా అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని,నిందితుల కోసం గాలిస్తున్నామని మీరట్ ఎస్ఎస్పీ అజయ్ సాహ్ని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీతో నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని... త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.
Recommended Video
ఉత్తరప్రదేశ్లో గడిచిన నెల రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి. ఇటీవలి కాలంలో మహిళలపై అక్కడ నేరాలు తీవ్రంగా పెరిగిపోయాయి. యూపీలోని హత్రస్ పట్టణంలో సెప్టెంబర్ 14న ఓ దళిత యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కూడా తాజాగా వెలుగుచూసింది. పొలం వద్దకు వెళ్లిన యువతిని... కొంతమంది ఈడ్చుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయడంతో నాలుక కూడా కొంత మేర తెగిపోయింది. ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.