కామాంధులను ఉరి తీసిన నిమిషాల్లోనే ఢిల్లీ జనాల కొత్త డిమాండ్: కేంద్రం ఎలా స్పందిస్తుందో..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు కామాంధులను తీహార్ కేంద్ర కారాగారంలో ఉరి కంబాన్ని ఎక్కించిన కొన్ని నిమిషాల వ్యవధిలో ఓ కొత్త డిమాండ్కు తెర లేచింది. నిర్భయ కుటుంబ సభ్యులు, ఢిల్లీ ప్రజలు ఈ డిమాండ్ను లేవనెత్తారు. ఈ డిమాండ్తో తీహార్ జైలు ఎదురుగా ప్లకార్డులను సైతం ప్రదర్శించారు. వారు లేవనెత్తిన డిమాండ్ పట్ల కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
నిర్భయకు న్యాయం చేకూర్చిన డాక్టర్ దిశ: ఎన్కౌంటర్.. మూడున్నర నెలల్లో గ్యాంగ్ రేప్ దోషుల ఉరికంబం..
న్యాయ దివస్గా..
ఆ డిమాండే- న్యాయ దివస్. నిర్భయ దోషులను ఉరి తీసిన మార్చి 20వ తేదీని న్యాయ దివస్గా ప్రకటించాలని ఢిల్లీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏడేళ్ల తరువాత నిర్భయకు న్యాయం దక్కిందని, దీన్ని చిరస్మరణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడాలనుకునే వారికి కనువిప్పు కలిగించేలా, అలాంటి వారి ఆలోచనాధోరణి మార్చేలా ఈ ఉరిశిక్ష మిగిలిపోవాలని అంటున్నారు. మరోసారి అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడాలనే ఆలోచన కూడా రాని విధంగా ఈ ఉరిశిక్షను అమలు చేసిన తేదీని న్యాయ దివస్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఢిల్లీలో హర్షాతిరేకాలు..
ఈ తెల్లవారు జామున సరిగ్గా 5:32 నిమిషాలకు నిర్భయ దోషులు అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ, పవన్ కుమార్ గుప్తా, ముఖేష్ కుమార్ సింగ్ ఉరికొయ్యలకు వేలాడారు. వారిని ఉరి తీశారనే వార్తను తెలుసుకున్న వెంటనే ఢిల్లీ ప్రజలు పెద్ద సంఖ్యలో తీహార్ కేంద్ర కారాగారానికి చేరుకున్నారు. వందలాది మంది గుమికూడారు. నిర్భయకు న్యాయం దక్కిందంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నిర్భయ జిందాబాద్.. అంటూ నినదించారు. ఢిల్లీ ప్రజలు ఒకేసారి పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో తీహార్ కేంద్ర కారాగారం ఉన్న షహీద్ భగత్ సింగ్ మార్గ్ కిటకిటలాడిపోయింది. వారి నినాదాలతో మారుమోగిపోయింది.
కరోనా వైరస్ భయపెడుతున్నా.. 144 సెక్షన్ విధించినా
ప్రాణాంతక కరోనా వైరస్ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని నియంత్రించడానికి దేశ రాజధానిలో 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. పెద్ద సంఖ్యలు జనం గుమికూడటంపై నిషేధం కొనసాగుతోంది. అయినప్పటికీ.. ఢిల్లీవాసులు వాటిని లెక్క చేయలేదు. కరోనా వైరస్ కలవరపెడుతున్నా పట్టించుకోలేదు. పెద్ద సంఖ్యలో తీహార్ కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్నారు. నిర్భయ తల్లి ఆశాదేవికి నైతిక మద్దతుగా నిలిచారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. థ్యాంక్స్ టు జ్యుడీషియరీ, వుయ్ డిమాండ్ న్యాయ్ దివస్, ది మార్నింగ్ ఫర్ జస్టిస్.. అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.
Recommended Video
బాణాసంచా పేల్చి.. స్వీట్లను పంచిపెట్టి..
ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో కూడా వేడుకలు చోటు చేసుకున్నాయి. హరినగర్, వసంత్ విహార్, సరస్వతి విహార్, కరోల్ బాగ్, ద్వారకా, సాకేత్ వంటి ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీదికి వచ్చారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జాతీయ పతాకాలను చేత పట్టుకుని వీధుల్లో తిరుగుతూ సందడి చేశారు. వారిలో యువకులు, వృద్ధులు, మహిళలు.. అనే తేడా లేదు. అన్ని వయస్సుల వారు కూడా రోడ్ల మీదికి వచ్చి, సంబరాలు జరుపుకొన్నారు.