నిర్భయ కేసు : నేడు దోషుల క్యురేటివ్ పిటిషన్లపై విచారణ.. అసలేంటి క్యురేటివ్ పిటిషన్?
నిర్భయ గ్యాంగ్ రేప్,హత్య కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటోన్న నలుగురు దోషుల క్యురేటివ్ పిటిషన్ను సుప్రీం కోర్టు నేడు విచారించనుంది. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం మధ్యాహ్నం 1.45గంటలకు ఈ పిటిషన్లపై విచారణ జరుపుతుంది. ఇప్పటికే రివ్యూ పిటిషన్లను సుప్రీం కొట్టివేసిన నేపథ్యంలో క్యురేటివ్ పిటిషన్లను కూడా న్యాయస్థానం దాదాపుగా తిరస్కరించవచ్చు. అదే జరిగితే పటియాలా కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ అమలు జరుగుతుంది. దాని ప్రకారం ఈ నెల 22న ఉదయం ఏడు గంటలకు నలుగురు దోషులను తీహార్ జైల్లో ఉరితీస్తారు.
క్యురేటివ్ పిటిషన్ అంటే ఏమిటి..
నిర్భయ దోషులు క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయడంతో.. అసలేంటి పిటిషన్ అన్న చర్చ జరుగుతోంది. ఏదైనా కేసులో దోషులు చిట్టచివరి న్యాయపరమైన అవకాశం కోసం దాఖలు చేసే పిటిషన్ను క్యురేటివ్ పిటిషన్ అంటారు. 2002లో రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా కేసులో క్యురేటివ్ పిటిషన్కు మొదటిసారి సుప్రీం న్యాయస్థానం అనుమతినిచ్చింది.
ఐదు నిమిషాలే..
సాధారణంగా క్యురేటివ్ పిటిషన్ విచారణకు న్యాయస్థానం కేటాయించేది కేవలం ఐదు నిమిషాలేనని న్యాయవాదులు చెబుతుంటారు. గతంలో ముంబై బాంబు పేలుళ్ల దోషి యాకుబ్ యెమెన్ క్యురేటివ్ పిటిషన్కు న్యాయస్థానం ఐదు నిమిషాల సమయమే కేటాయించింది. చావు బతుకులకు సంబంధించిన పిటిషన్పై విచారణకు కేవలం ఐదు నిమిషాల సమయాన్నే కేటాయించడంపై యెమెన్ తరుపు న్యాయవాది జస్పాల్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
క్యురేటివ్ పిటిషన్లను కొట్టివేస్తే..
నిర్భయ కేసులో వినయ్ శర్మ(26),ముకేశ్ కుమార్(32) క్యురేటివ్ పిటిషన్లు దరఖాస్తు చేసుకున్నారు. క్యురేటివ్ పిటిషన్లు కూడా తిరస్కరణకు గురైతే.. ఇక వారికి మిగిలే ఆప్షన్ రాష్ట్రపతి క్షమాభిక్ష మాత్రమే. నిర్భయ కేసుపై దేశం మొత్తం దాదాపుగా ఒకే అభిప్రాయంతో ఉంది కాబట్టి.. దోషులకు క్షమాభిక్ష పెట్టే అవకాశం దాదాపుగా లేకపోవచ్చు.
Recommended Video
ఈ నెల 22న ఉరిశిక్ష..
ప్రస్తుతం నిర్భయ క్యురేటివ్ పిటిషన్లను విచారించబోతున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో న్యాయమూర్తులు బానుమతి,భూషన్ కూడా ఉన్నారు. 2017లో నిర్భయ నిందితులను దోషులుగా తేల్చిన బెంచ్లో వీరు కూడా సభ్యులు. అదే బెంచ్ దోషులకు మరణశిక్షను విధించింది. ఇటీవల పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడంతో.. ఈ నెల 22న తీహార్ జైల్లో దోషుల ఉరితీతకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తలారి పవన్ జల్లాద్ ఈ నలుగురిని ఉరితీస్తాడని సమాచారం.