మిస్టరీ అలా వీడింది, వారిని వదలొద్దని నిర్భయ చెప్పింది: పోలీస్ ఆఫీసర్
తనను ఇలా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టవద్దని నిర్భయ చెప్పినట్లు పోలీస్ అధికారిణి ఛాయా శర్మ శుక్రవారం తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
న్యూఢిల్లీ: తనను ఇలా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టవద్దని నిర్భయ చెప్పినట్లు పోలీస్ అధికారిణి ఛాయా శర్మ శుక్రవారం తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
చదవండి: నిర్భయ కేసులో తీర్పుపై నేరస్తుల తరఫు లాయర్ ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు
నిర్భయ అత్యాచార కేసు దోషులకు ఉరి శిక్ష సరైనదే అని కింది కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించడంపై పోలీస్ అధికారిణి చాయాశర్మ స్పందించారు.
నిర్భయ మరణ వాంగ్మూలం తీసుకునేందుకు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న ఆమెను కలుసుకున్నానంటూ ఛాయాశర్మ ఆ సంఘటనలను గుర్తు చేసుకున్నారు. నిర్భయ చెప్పిన కీలక ఆధారాలతోనే నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు.
బాధపడలేదు.. నిర్భయంగా చెప్పింది
అత్యాచార బాధితురాలిగా నిర్భయ బాధపడలేదని ఛాయాశర్మ తెలిపారు. సాధారణమైన అమ్మాయిలాగా ఎంతో నిబ్బరంగా ఉందని, ఇద్దరు న్యాయమూర్తులు, వైద్యుల సమక్షంలో తనకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా చెప్పుకుందని తెలిపారు.
నిర్భయ చెప్పడం వల్లే నిందితుల్ని పట్టుకోగలిగాం
నిర్భయ చెప్పిన ఆధారాల వల్లే నిందితులను పట్టుకోగలిగామని, ఈ కేసులో నిందితులు ఎవరో తెలియకుండా వారిని పట్టుకోవడం తొలుత చాలా కష్టంగా మారిందని ఛాయాశర్మ అన్నారు.
300 వాహనాల షార్ట్ లిస్ట్, 100 మంది బృందం
ఘటన జరిగిన బస్సును గుర్తించడానికి దాదాపు 300 వాహనాలను షార్ట్లిస్ట్ చేశామని ఛాయాశర్మ తెలిపారు. 100తో కూడిన పోలీసు బృందం నిరంతరం శ్రమించి నిందితుల కోసం గాలించిందన్నారు. ఘటన జరిగిన 18 గంటల్లోపే పోలీసులు బస్సు డ్రైవరు రాంసింగ్ను పట్టుకున్నారని, అతడిని విచారించి మిగతా అయిదుగురిని పట్టుకున్నారని తెలిపారు.
18 రోజుల్లో చార్జీషీట్
నిర్భయ కేసును చేధించేందుకు తనకు మంచి టీమ్ దొరికిందని ఛాయాశర్మ అన్నారు. అందరూ కూడా బాగా పని చేశారన్నారు. తాము కేవలం 18 రోజుల్లో ఛార్జీషీట్ వేశామన్నారు. ఈ ఛార్జీషీట్ రెండు కింది కోర్టుల్లో, ప్రస్తుతం సుప్రీం కోర్టులో బలంగా నిలిచిందన్నారు.
ఎవరీ ఛాయాశర్మ
అప్పట్లో నిర్భయ కేసును చేధించడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారిణి ఛాయా శర్మ. 23 ఏళ్ల నిర్భయ మరణ వాంగ్మూలం తీసుకునేందుకు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న ఆమెను కలుసుకున్నారు. ప్రస్తుతం ఛాయా శర్మ మానవహక్కుల కమిషన్లో పనిచేస్తున్నారు.