నిర్భయ ఘటన: నిందితులకు ఉరిశిక్ష ఖరారు తేదీ మళ్లీ వాయిదా..ఎప్పుడంటే..?
న్యూఢిల్లీ: నిర్భయ ఘటనలో శిక్ష నుంచి తప్పించుకునేందుకు నిందితులు చివరినిమిషంలో అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే నలుగురు నిందితుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముందు మరోసారి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుపుతూ తన ఉరిశిక్షపై స్టే విధించాల్సిందిగా ఢిల్లీ పటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ను విచారణ చేసిన కోర్టు ఉరిశిక్ష అమలు తేదీని వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఉరిశిక్షను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అంతకుముందు క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయడంలో జాప్యం చేసిన నిందితుల తరపున లాయర్లపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతకుముందు పవన్ అక్షయ్ కుమార్ సింగ్లు డెత్ వారెంట్పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను ట్రయల్ కోర్టు కొట్టివేసింది. రాష్ట్రపతి ముందుకు క్షమాభిక్ష పిటిషన్ వేసినందున డెత్ వారెంట్పై స్టే ఇవ్వాలని పవన్ కుమార్ గుప్తా తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ ఏపీ సింగ్ కోర్టును కోరారు. అయితే భోజన విరామం తర్వాత విచారణ చేస్తామని జడ్జ్ చెప్పారు.
భోజన విరామం తర్వాత పిటిషన్ను విచారణ చేసిన కోర్టు లాయర్ ఏపీ సింగ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిప్పుతో చెలగాటాలాడరాదని పేర్కొంది. ఈ క్షణంలో ఏ చిన్న తప్పు జరిగినా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న విషయం గుర్తెరగాలని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన తీహార్ జైలు వర్గాలు బంతి కోర్టు చేతిలో ఉందని... ప్రస్తుతం మెర్సీ పిటిషన్ ఉన్నందున ఇందులో జడ్జీ జోక్యం ఉండబోదని వెల్లడించింది. ఇక పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్పై రాష్ట్రపతి స్టేటస్ రిపోర్టును తెప్పించుకుంటారని అదే జరిగితే సుమోటోగా డెత్ వారెంట్పై స్టే వస్తుందని తీహార్ జైలు అధికారులు చెప్పారు.