NIRF Rankings 2020: ఐఐటీ మద్రాస్ టాప్, టాప్20లో హైదరాబాద్ ఐఐటీ, 40లో ఏయూ
న్యూఢిల్లీ: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటీ మద్రాస్ అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాలో మరోసారి సత్తా చాటింది. తాజాగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ప్రకటించిన ర్యాంకులలో ఐఐటీ మద్రాస్ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది.
ఇంజినీరింగ్ విభాగంతోపాటు ఇతర అన్ని విభాగాల్లోనూ ఐఐటీ మద్రాసు తొలిస్థానంలో నిలవడం విశేషం. ఇక రెండు మూడు స్థానాల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) బెంగళూరు, ఐఐటీ ఢిల్లీ నిలిచాయి. ఐఐటీ హైదరాబాద్కు 17వ ర్యాంక్ దక్కింది.
ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ మద్రాసు మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే ఉన్నాయి. ఇక యూనివర్సిటీ విభాగాల్లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అగ్రస్థానంలో నిలిచింది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ రెండవ స్థానంలో నిలవగా, బెనారస్ హిందూ యూనివర్సిటీ మూడవ స్థానంలో నిలిచాయి.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం 15వ ర్యాంక్ సాధించింది. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీకి 36వ ర్యాంకు దక్కింది. వరంగల్ ఎన్ఐటీకి 46 ర్యాంక్, కేఎల్ యూనివర్సిటీ 70వ ర్యాంక్ సాధించాయి. మేనేజింగ్ విభాగంలో ఐఐఎం తొలి ర్యాంక్ సాధించింది. మెడికల్ విభాగంలో ఢిల్లీ ఎయిమ్స్ ప్రథమ స్థానంలో నిలిచింది. గత మూడు సంవత్సరాలుగా ఎయిమ్స్ ప్రథమ స్థానంలోనే కొనసాగుతోంది. మొత్తం పది విభాగాలకు సంబంధించిన 100 ర్యాంకులను కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంగ్ వెల్లడించారు.