జమ్మూకాశ్మీర్ స్పీకర్ పదవి నుంచి బీజేపీ నేత నిర్మల్ సింగ్ తొలగింపు: ఎందుకంటే..?
శ్రీనగర్: రాజకీయ పార్టీల నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ స్పీకర్గా కొనసాగుతున్న బీజేపీ నేత నిర్మల్ సింగ్ను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఆదివారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు జమ్మూకాశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ జేసీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.
అక్టోబర్ 31 నుంచి జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా రద్దయినందున నిర్మల్ సింగ్ హోదా కూడా రద్దయినట్లుగా పరిగణిస్తున్నట్లు న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
ఆర్టికల్ 370తోపాటు రద్దయిన జమ్మూకాశ్మీర్ రాజ్యాంగం ప్రకారమే నిర్మల్ సింగ్ స్పీకర్గా గతంలో నియమితులు కావడం గమనార్హం. ఈ క్రమంలో ఆయన స్పీకర్ పదవిలో కొనసాగడంపై రాజకీయ పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే లెఫ్ట్నెంట్ గవర్నర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంతకుముందున్న జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ రద్దపోయిందని, అంతేగాక, ఆ రాష్ట్రంలో అమల్లు ఉన్న ఆర్టికల్ 370ని కూడా తొలగించారని.. ఇప్పుండు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటైనా నిర్మల్ సింగ్ ఆ పదవిలో ఎలా కొనసాగుతున్నారని నేషనల్ పాంథర్స్ పార్టీ నేతలు ప్రశ్నించారు.
కాగా, మే 10, 2018లో నిర్మల్ సింగ్ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన విషయం తెలిసిందే. అదే ఏడాది జూన్ 20 నుంచి అక్కడ గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత కూడా నవంబర్ 4 వరకు కూడా నిర్మల్ సింగ్ స్పీకర్ హోదాలోనే కొనసాగారు. ఈ క్రమంలోనే విమర్శలు రావడం.. తాజాగా ఆ పదవి నుంచి తొలగించడం జరిగాయి.