ఎగవేత దారులకు మీరు కాదా ఊతం ఇచ్చింది..? రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించిన నిర్మలా సీతారామన్..!!
ఢిల్లీ/హైదరాబాద్ : విచ్చలవిడిగా బ్యాంకుల్లో రుణాలు పొంది వాటిని ఎగ్గొంట్టేందుకు సహకరించిందే కాకుండా బీజేపి మీద నెపం మోపడం ఎంత వరకు సమంజసమని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలోని బ్యాంకులను దివాళా తీయించిన 50మంది ఎగవేత దారుల జాబితాను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రుణాలు ఎగ్గొట్టిన వారిలో బీజేపీ నాయకులు ఉన్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు.
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. బ్యాంకు రుణాల మాఫీ అంటే ఏంటో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను సంప్రదించి తెలుసుకోవాలని చురకలంటించారు. 2009-10, 2013-14 మధ్య షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు 1,45,226 కోట్లను మాఫీ చేశాయన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్వాకం కాదా అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.
అంతే కాకుండా బ్యాంక్ నిబంధనల గురించి, లోన్ మార్గదర్శకాల గురించి ఆర్థిక మంత్రి వివరించారు. రిజర్వ్ బ్యాంకు నిర్దేశించిన నాలుగేళ్ల ప్రొవిజనల్ సైకిల్ ప్రకారం నిరర్థక ఆస్తులకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బ్యాంకులు ఎవరి రుణాన్నీ మాఫీ చేయలేదని, రుణాలు చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ కావాలనే ఎగగొట్టినవారిని విల్ ఫుల్ డీఫాల్టర్లుగా ఆర్ బీ ఐ ఆయా కేటగిరీల్లో చేర్చిందని వివరించారు.
Recommended Video
నాటి యూపీఏ ప్రభుత్వం ఫోన్ బ్యాంకింగ్ ద్వారా లాభపడినవారే డీఫాల్టర్లుగా మారారని నిర్మల ద్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్న రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు. 2006-2018 మధ్య మొండి రుణాలను ఎక్కువగా ఇచ్చారని ఆమె వెల్లడించారు. అటు-నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ. విజయ్ మాల్యాల విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె మొత్తం 13 ట్వీట్లు చేయడం విశేషం.