కనీస మద్దతు ధర కల్పించలేనివారు విమర్శలు చేస్తున్నారు: కాంగ్రెస్పై నిర్మలా సీతారామన్ ఫైర్
చెన్నై: తమ పాలనలో రైతుల పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కల్పించని కాంగ్రెస్ పార్టీ.. తాజాగా కేంద్రం తీసుకొచ్చిన రైతులకు మేలు చేసే వ్యవసాయ చట్టాలపై విమర్శలు చేయడం విడ్డూరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రైతులకు తమ పంటను అమ్ముకునే స్వేచ్ఛ ఈ చట్టాల ద్వారా లభిస్తుందని అన్నారు.
ఈ చట్టాలతో రాష్ట్రాల మధ్య వాణిజ్యం పెరుగుతుందన్నారు. ఎంఎస్పీని రద్దు చేస్తుందంటూ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై కేంద్రమంత్రి మండిపడ్డారు. రైతులకు నష్టం వాటిల్లే ఎలాంటి చర్యలను తమ ప్రభుత్వం చేపట్టదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
చెన్నైలో కేంద్రమంత్రి నిర్మల మీడియాతో మాట్లాడారు. కనీస మద్దతు ధర ఉంది, ఎప్పుడూ ఉంటుందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతు పంటలకు మద్దతు ధర కల్పించేందుకే కేంద్రం కొత్త చట్టాలను తీసుకొచ్చిందని, ఈ వ్యవసాయ చట్టాలకు రైతులకు పంట అమ్ముకునే స్వేచ్ఛ లభిస్తుందని తెలిపారు.
ప్రస్తుతం 20-23 పంటలకు ఎంఎస్పీని కల్పిస్తున్నామన్న కేంద్రమంత్రి.. వరి, గోధుమలకు మినహా మిగితా పంటలను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రస్తుతం రైతులకు మేలు కలిగే చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే.. కాంగ్రెస్ మొసలి కన్నీరుకారుస్తోందని విమర్శించారు.
2014 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వరి, గోధుమలతోపాటు ఇతర పంటలకు కూడా కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడు కల్పిస్తూ వస్తోందని తెలిపారు.
సుమారు 23-24 లక్షల టన్నుల పప్పుధాన్యాలు అవసరం అయినప్పటికీ, కేవలం 16 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయబడ్డాయి. మిగిలినవి దిగుమతి చేయబడ్డాయి, ఎన్డిఎ ప్రభుత్వం అటువంటి పరిస్థితిని తిప్పికొట్టడానికి ఇతర పంటలకు ఎంఎస్పిని ఇచ్చిందని కేంద్రమంత్రి తెలిపారు.