ఆమె మంత్రిగా సమర్థురాలు కారు... ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా వెళుతోంది: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందంటూ ప్రధాని మోడీని అటాక్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పిందని చెబుతూ ఓ మీడియా విశ్లేషణ గురించి చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మందగిస్తోందని చెప్పిన రాహుల్ గాంధీ... ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదని ఆయన అన్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి చూస్తే అన్ని రంగాలు తిరోగమనంలోకి జారుకునే అవకాశం ఉందని అన్నారు.
ఆర్థిక వ్యవహారాల శాఖను డీల్ చేయగల సమర్థత నిర్మలా సీతారామన్కు లేదని రాహుల్ గాంధీ అన్నారు. సొరంగం చివరన వెలుతురు ఉందని నిర్మలా సీతారామన్ చెబుతున్నారని అయితే అంతకంటే ముందు ఆర్థిక మాంద్యం అనే రైలు వేగంగా వస్తోందన్న విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. జూన్లో 8 ప్రధాన పరిశ్రమల్లో వృద్ధి రేటు 0.2శాతానికి పడిపోయిందన్న గణాంకాలు వెలువడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా సిమెంట్ తయారీ రంగం, చమురు సంబంధిత రంగాలు నష్టాల బాట పడుతున్న క్రమంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Mr PM, The economy has derailed and there seems to be no light at the end of the tunnel. If your incompetent FM is telling you there is light, trust me it’s the train of recession coming at full throttle.https://t.co/ewoVj5m27X
— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2019
ఇక 8 రంగాల పరిశ్రమలకు సంబంధించి బుధవారం కూడా ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. మే నెలలో 4.3 శాతానికి పడిపోయిందని అంతకుముందు అది 5.1శాతంగా ఉండేదని లెక్కలు తెలిపాయి. ఇక ఎనిమిది రంగాల పరిశ్రమలు- బొగ్గు, ముడిచమురు, సహజ గ్యాస్, రిఫైనరీ ఉత్పత్తులు, ఫర్టిలైజర్లు, స్టీల్, సిమెంట్, విద్యుత్ పరిశ్రమలు గతేడాది జూన్లో 7.8శాతానికి పెరిగాయి. జీఎస్టీ, డీమోనిటైజేషన్తో భారత ఆర్థిక వ్యవస్థను మోడీ సర్కారు భ్రష్టు పట్టించిందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.