వంద మంది ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు అరుదైన గౌరవం
ఢిల్లీ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు అరుదైన గౌరవం లభించింది. యూకే - ఇండియా సంబంధాలను మెరుగుపరిచిన వంద మంది ప్రభావవంతమైన మహిళల్లో ఆమెకు చోటు దక్కడం విశేషం. సోమవారం నాడు భారత దినోత్సవం సందర్భంగా ఆ జాబితాలో చోటు దక్కిన వారి వివరాలు వెల్లడించారు యూకే హోంశాఖ కార్యదర్శి సాజిద్ జావిద్. ఆ మేరకు పార్లమెంట్ హౌజ్లో విడుదల చేశారు. బ్రిటన్కు చెందిన సీనియర్ కేబినెట్ మంత్రి పెన్నీ మోర్డాంట్కు కూడా ఈ జాబితాలో స్థానం లభించింది.
యూకే ప్రభుత్వం విడుదల చేసిన ఈ జాబితాలోని మహిళలు ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారని సాజిద్ వ్యాఖ్యానించారు. రెండు దేశాలను శక్తిమంతంగా మలచడంలో వారి కృషి ఎనలేదని గుర్తుచేశారు. ఇకపై కూడా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, కళలు, అక్షరాస్యత తదితర అంశాల్లో సత్సంబంధాలు కొనసాగుతాయని తెలిపారు.
మళ్లీ పునర్విభజన దిశగా వరంగల్.. కొత్త జిల్లాలకు సీఎం గ్రీన్ సిగ్నల్..! మొత్తం ఎన్నంటే..!
గత ఎన్డీయే ప్రభుత్వంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్ ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాల్లో కీలకపాత్ర పోషించారు. మన దేశంలో ఈ శాఖను అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన ప్రభావవంతమైన మహిళగా ఆమెకు గుర్తింపు లభించింది.
నిర్మలా సీతారామన్కు యూకేతో మంచి అనుబంధం ఉందని చెప్పొచ్చు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్న ఆమె అక్కడ కొన్నాళ్లపాటు ఉద్యోగం కూడా చేశారు. అందుకే ఆ దేశంతో ఆమెకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్.. యూకే - ఇండియా మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాల్లో కీలకపాత్ర పోషించారు. అదలావుంటే మహిళా శక్తికి నిదర్శనంగా అత్యంత ప్రభావవంతమైన వంద మంది మహిళల జాబితాలో ఆమెకు చోటు దక్కిందని యూకే లోని భారత హైకమిషనర్ రుచి ఘన్శ్యాం అభివర్ణించడం విశేషం.