లాక్ డౌన్ ప్యాకేజీ : 1.70లక్షల కోట్లు.. పేదలు,కార్మికులు,ఉద్యోగులు,మహిళలు.. ఎవరికెంత?
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఆయా పట్టణాలు,నగరాల్లో చిక్కుకుపోయిన వలస జీవులు,పని లేక ఇబ్బంది పడుతున్న కూలీలు.. వీరంతా ఆకలితో అలమటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.1.70లక్షలకోట్ల ప్యాకేజీ ప్రకటించారు.
దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని.. అలాగే ఎవరి చేతిలోనూ డబ్బు లేని పరిస్థితి ఉండవద్దని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ ప్యాకేజీతో పేదల ఆకలి తీర్చడంతో పాటు వారి ఖాతాల్లో ప్రత్యక్షంగా కొంత డబ్బును జమ చేస్తామని చెప్పారు. ఇక కరోనాతో ప్రత్యక్ష యుద్దం చేస్తున్న డాక్టర్లు,నర్సులు,పారామెడికల్ స్టాఫ్,ఆశా వర్కర్స్,శానిటైజేషన్ వర్కర్స్ కోసం రూ.50లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ అందించబోతున్నట్టు ప్రకటించారు.
రేషన్ పెంపు.. మహిళల ఖాతాల్లో డబ్బులు..
గరీబ్ కల్యాణ్ పథకం కింద వచ్చే మూడు నెలల పాటు 80కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రతీ నెలా ఒక్కొక్కరికి అందిస్తున్న 5కేజీల బియ్యం లేదా 5 కేజీల గోధుమలతో పాటు మరో 5కేజీలు అదనంగా అందించనున్నట్టు తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కిసాన్ సమ్మాన్ నిధి హామిలో భాగంగా.. మొదటి వాయిదా కింద రూ.2వేలను రైతుల ఖాతాల్లో వేయనున్నట్టు తెలిపారు.
ఈ పథకం కింద మొత్తం 8.69కోట్ల రైతులు లబ్ది పొందనున్నట్టు తెలిపారు. జన్ధన్ ఖాతాలను కలిగిన 20కోట్ల మంది మహిళలకు ప్రతీ నెలా వారి ఖాతాలో రూ.500 చొప్పున వచ్చే మూడు నెలల పాటు జమ చేయనున్నట్టు తెలిపారు. వృద్దులు,దివ్యాంగులకు ప్రతీ నెలా ఎక్స్గ్రేషియా కింద రూ.1000 చెల్లించనున్నట్టు తెలిపారు. తద్వారా 3కోట్ల మందికి లబ్ది చేకూరనుందని తెలిపారు.
ఉద్యోగుల పీఎఫ్పై కీలక ప్రకటన
సంఘటిత రంగానికి సంబంధించి.. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగి,ఉద్యోగ సంస్థ తరుపున 24శాతం పీఎఫ్ డబ్బును ప్రభుత్వమే చెల్లిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే 15వేల కంటే తక్కువ
వేతనం ఉన్నవారికే ఇది వర్తిస్తుందన్నారు. ఇక ఈపీఎఫ్వో స్కీమ్కి సంబంధించి కొన్ని సవరణలు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ఉద్యోగులు 75శాతం పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకునేలా నిబంధనలను సవరిస్తున్నట్టు చెప్పారు. ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
భవన నిర్మాణ రంగం..,ఉచిత వంట గ్యాస్..
భవన నిర్మాణ రంగానికి సంబంధించి బిల్డింగ్ వెల్ఫేర్ స్కీమ్ కింద ప్రభుత్వం వద్ద రూ.31,000కోట్ల నిధులు ఉన్నాయని సీతారామన్ తెలిపారు. ఇందులో 3.5కోట్ల మంది కార్మికులు రిజిస్టర్ చేసుకున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిధిని ఉపయోగించుకుని భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని సూచించారు. MGNREGA పథకం కింద ఇచ్చే వేతనాన్ని రూ.2వేలకు పెంచుతున్నట్టు తెలిపారు.
ఉజ్వల పథకం కింద రాబోయే 3 నెలల పాటు మహిళలకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయనున్నట్టు తెలిపారు. ఇక మహిళలకు కొలాటరల్ ఫ్రీ లోన్స్ను రూ.20లక్షలకు పొడగిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ను ఉపయోగించుకోవాలని తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని ప్యాకేజీలు..?
భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు.. తక్షణ చర్యగా ప్యాకేజీని ప్రకటించినట్టు చెప్పారు. లాక్ డౌన్ ప్రకటించిన 36గంటల్లో ఎవరైతే ఎక్కువగా ప్రభావితమయ్యారో.. వారిని దృష్టిలో ఉంచుకుని వెల్ఫేర్ ప్యాకేజీని ప్రకటించినట్టు చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 ఎక్స్గ్రేషియా పొందేందుకు ఎవరైనా వృద్దులు,దివ్యాంగులు,ఒంటరి మహిళలకు బ్యాంకు ఖాతాలు లేకపోతే.. అందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ఆక్వా రైతుల కోసం ఇప్పటికే ప్రత్యేక రాయితీలు ప్రకటించామని.. అవి వారికి చేరుతున్నాయో లేదో.. తానే స్వయంగా పరిశీలించనున్నట్టు సీతారామన్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.