జైజవాన్ : అమరజవాను తల్లికి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పాదాభివందనం
డెహ్రాడూన్ : నిర్మలా సీతారామన్...దేశ రక్షణశాఖ మంత్రి. ప్రధాని నరేంద్రమోడీ ఆమెపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దేశప్రజల మన్ననలు పొందుతున్నమహిళా మంత్రి నిర్మలా సీతారామన్. రక్షణ శాఖ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ... ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు నిర్మలా సీతారామన్. తాజాగా మరోసారి తానేంటో చూపించి అందరి ప్రశంసలు పొందుతున్నారు.
ఇక అసలు విషయానికొస్తే... డెహ్రాడూన్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు నిర్మలా సీతారామన్. ఆ కార్యక్రమంలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. అయితే అక్కడే ఉన్న ఓ అమరజవాను తల్లిని వేదికపైకి పిలిచారు నిర్మలా సీతారామన్. ఆ తల్లి వేదికపైకి రాగానే డిఫెన్స్ మినిస్టర్ వెంటనే ఆమె కాళ్లకు నమస్కరించారు .దేశానికి ఒక గొప్ప వ్యక్తిని అందించారంటూ ఆమెకు పాదాభివందనం చేశారు నిర్మలా సీతారామన్. ఆ తర్వాత ఆమెకు పూలబొక్కే అందించి గౌరవించారు.
ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న మసూరి బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో నెటిజెన్లు ఆమె పాదాభివందనం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక ఆ కార్యక్రమంలో మాట్లాడిన నిర్మలా సీతారామన్.. సైనికుల కోసం నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారని ఇది గత కొన్ని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నిందని గుర్తుచేశారు. మోడీ మాటల మనిషి కాదని చేతల మనిషని నిర్మలా సీతారామన్ చెప్పారు. పీయూష్ గోయల్ పార్లమెంటులో ప్రకటించినట్లుగానే వన్ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ కింద ఇప్పటికే రూ.35వేల కోట్లు అర్హులైన సైనికులకు అందజేశామని చెప్పారు. ఇక మధ్యంతర బడ్జెట్లో భాగంగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కింద రూ. 8వేల కోట్లు కేటాయించడం జరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
आज @nsitharaman जी ने देहरादून में एक पूर्व सैनिक सम्मेलन में प्रतिभाग किया । जब उत्तराखंड के अमर शहीद अजीत प्रधान,सेना मेडल सम्मानित,की माँ हेम कुमारी जी उनका स्वागत करने पहुँचीं तो निर्मला जी ने तुरंत आगे बढ़ कर उनके पाँव छुए।
— Ganesh Joshi (@ganeshjoshibjp) March 4, 2019
हम सभी पूर्व सैनिकों का सर गर्व से ऊँचा हो गया । pic.twitter.com/Etsg8Rc0ZR
ఇదిలా ఉంటే మోడీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా అబద్ధాలు ప్రచారం జరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు. సైనికుల కోసం ఏ ప్రభుత్వం చేయలేనిది మోడీ సర్కార్ చేసి చూపిందన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్పై ఏమైనా అనుమానాలు ఉంటే తనకు ఈమెయిల్ చేయొచ్చని నిర్మలా సీతారామన్ అన్నారు. గతనెల మోడీ ప్రభుత్వం నేషనల్ వార్ మెమోరియల్ను జాతికి అంకితం చేసిందని చెప్పిన నిర్మలా సీతారామన్ గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం ఈ స్తూపం నిర్మాణం కోసం కృషి చేయలేదన్నారు.