నిర్మలా సీతారామన్ నా క్లాస్ మేట్: అప్పట్ల చాలా విషయాలను పంచుకునే వాళ్లం: నోబెల్ అవార్డు గ్రహీత
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన క్లాస్ మేట్ అని ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తామిద్దరం కలిసి చదువుకున్నామని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ వెల్లడించారు. ఆర్థిక శాస్త్రం, భారత ఆర్థిక వ్యవస్థ.. వంటి పలు అంశాలపై తామిద్దరం చర్చించుకునే వాళ్లమని, ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకునే వాళ్లమని అన్నారు. చాలా విషయాల్లో ఆమె తన అభిప్రాయాలను ఏకీభవించేవారని అన్నారు. ఆదివారం ఆయన రెండు ప్రముఖ జాతీయ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పలు అంశాలను వెల్లడించారు.
తీవ్ర సంక్షోభంలోకి బ్యాంకింగ్ వ్యవస్థ: ఆర్బీఐ అప్రమత్తంగా లేదంటూ అభిజిత్ బెనర్జీ
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో తాను ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించానని, అనంతరం అమెరికాకు వెళ్లిపోయినట్లు అభిజిత్ బెనర్జీ చెప్పారు. 1983లో తాను జేఎన్ యూలో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశానని పేర్కొన్నారు. ఆ మరుసటి ఏడాదిలోనే నిర్మలా సీతారామన్.. అదే అంశంలో ఎంఫిల్ పూర్తి చేశారని గుర్తు చేసుకున్నారు. తామిద్దరం క్లోజ్ ఫ్రెండ్సేమీ కానప్పటికీ.. ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవని అన్నారు. ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన చాలా విషయాలను నిర్మలా సీతారామన్ తన వద్ద ప్రస్తావించేవారని, తమ మధ్య ఆరోగ్యకరమైన డిబేట్ నడిచేదని అన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ నానాటికీ దిగజారుతోందని, వృద్ధి రేటు గానీ, స్థూల జాతీయోత్పత్తి గానీ.. ఆందోళనకరంగా పరిణమించిందంటూ అభిజిత్ బెనర్జీ కొద్దిరోజుల కిందటే వెల్లడించిన విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ దిగజారిందని అభిజిత్ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేస్తోన్న సమయంలో ఆయన క్లాస్ మేట్ నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా పని చేస్తుండం ప్రాధాన్యతను సంతరిచుకుంది. నిర్మలా సీతారామన్ తెలివైన మహిళ అని, ఎలాంటి సమస్యలనైనా ఆమె సునాయసంగా అధిగమించగలరని అభిజిత్ బెనర్జీ ప్రశంసించారు. ఆర్థిక రంగంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను కూడా ఆమె అధిగమిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఈ తరహాలో భారత ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవడాన్ని తాను ఇదివరకు ఎప్పుడూ చూడలేదని అభిజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. కొన్ ఆర్థిక రంగానికి వెన్నెముకగా భావించిన కొన్ని కీలక రంగాలకు సంబంధించిన జాతీయ నమూనా సర్వే (నేషనల్ శాంపిల్ సర్వే-ఎన్ఎస్ఎస్) వివరాలపై తాను అధ్యయనం చేశానని అభిజిత్ బెనర్జీ చెప్పారు. ఆయా రంగాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఇలాగే కొనసాగడం భారత్ వంటి దేశానికి ఏ మాత్రం శుభ పరిణామం కాదని, దీన్ని వీలైనంత త్వరగా చుట్టబెట్టేయడం మంచిదని అన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే పరిస్థితి స్వల్పంగా దిగజారిందని చెప్పారు.
కేంద్రం ఇటీవలే విధించిన కార్పొరేట్ పన్నుల విధానం దేశానికి దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుందని అభిజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. నేల ముఖం పట్టిన దేశ ఆర్థిక వ్యవస్థ సూచీని ఇప్పటికిప్పుడు నిలబెట్టడం అనేది అనేక సవాళ్లతో కూడుకుని ఉంటుందని, దీనికోసం కొన్ని కీలక రంగాల్లో స్థిరత్వాన్ని సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మిగిలిన వాటితో పోల్చుకుంటే- వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు క్షీణించడం ఆందోళనకర పరిణామమని అన్నారు. దీన్ని నిలబెట్టడానికి తక్షణ చర్యలు అవసరమని అభిజిత్ బెనర్జీ చెప్పుకొచ్చారు.