బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ల నష్టానికి కారణమేంటి.. ఇదీ నిర్మలా సీతారామన్ రియాక్షన్..
ఈ నెల 1వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు.. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ఆశించిన విధంగా లేని కారణంగానే మార్కెట్లు కుదేలయ్యాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై నిర్మలా సీతారామన్ వాదనేంటి..? తాజాగా FICCI నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సంబంధించి ఆమెకు దీనిపై ప్రశ్న ఎదురైంది.
బడ్జెట్ రోజున ఎందుకు కుప్పకూలాయి..
బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు ఎందుకు నష్టోయాయని కార్యక్రమానికి హాజరైన ఓ అతిథి నిర్మలా సీతారామన్ను ప్రశ్నించారు. దానికి ఆమె.. 'కానీ వారు ఈరోజు సంతోషంగా ఉండటం నేను చూశాను..' అని బదులిచ్చారు. 'బడ్జెట్ రోజున వీకెండ్ మూడ్.. కానీ ఈరోజు సోమవారం.. నిజమైన వర్కింగ్ మూడ్లో ఉండే రోజు..' అని వ్యాఖ్యానించారు. 'ఈరోజు వారు హ్యాపీ మూడ్లో ఉన్నారు. లేరా..?, అత్యుల్లాసంగా లేకపోవచ్చు.. కానీ సంతోషంగా ఉన్నారు..' అని చెప్పుకొచ్చారు.
శనివారం అయినప్పటికీ బీఎస్ఈ ట్రేడింగ్..
నిజానికి శని,ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు అన్న సంగతి తెలిసిందే. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప మార్కెట్లు సెలవు దినాల్లో పనిచేయవు. అయితే బడ్జెట్ నేపథ్యంలో శనివారం కూడా బీఎస్ఈ ట్రేడింగ్ నిర్వహించింది. రెగ్యులర్ పనిదినాల తరహాలోనే ఆరోజు కూడా ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు ట్రేడింగ్ సెషన్ కొనసాగింది.
కుప్పకూలడానికి కారణమేంటి
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఆరంభంలో స్టాక్ మార్కెట్లు స్థిరంగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత కుప్పకూలడం మొదలైంది. ప్రసంగం పూర్తయ్యేసరికి మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఈక్విటీ మార్కెట్లకు బడ్జెట్ ప్రతికూలంగా ఉన్నందునే స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూసినట్టు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతో పాటు ఆదాయపు పన్ను విధానంలో రెండు ఆప్షన్స్ ఇవ్వడం.. అది కాస్త గందరగోళానికి దారితీయడం కూడా మార్కెట్ల పతనానికి కారణమంటున్నారు. గందరగోళం కారణంగా పన్ను పొదుపు పథకాల్లో పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడిందంటున్నారు.
సోమవారం లాభాల్లోకి..
బడ్జెట్ 2020 ప్రభావంతో నిన్నటివరకు నష్టాలను చవిచూసిన మార్కెట్లు సోమవారం కాస్త పుంజుకున్నాయి. ఆటో,మెటల్ రంగాల్లో షేర్లు పుంజుకోవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 136 పాయింట్ల లాభంతో 39,872 పాయింట్ల వద్ద ముగియగా.. నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 11,708 పాయింట్ల వద్ద ముగిసింది.