ఆ కార్ల సంస్థలో 1700 మంది ఉద్యోగస్తులకు ఉద్వాసన..!
న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ భారత్లోని తన ప్లాంట్లో దాదాపు 1700 ఉద్యోగాలకు కోత పెట్టనుంది. ఈ కోతలన్నీ మ్యానుఫాక్చరింగ్ ఆపరేషన్స్లోనే ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిస్సాన్ ప్లాంట్లలో మొత్తం 6వేల ఉద్యోగస్తులను తొలగించాలన్న డెసిషన్కు యాజమాన్యం వచ్చేసింది. ఇందులో భారత్ నుంచి 1700 మంది ఉద్యోగస్తులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసింది.
2018-19 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లాంట్లలో 6100 ఉద్యోగాలకు ఉద్వాసన పలకాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక ఈ ప్రక్రియతో చెన్నై లోని రినాల్ట్-నిస్సాన్ ప్లాంట్లో 1700 మందిని తొలగించనుంది యాజమాన్యం. అయితే దీనిపై మాట్లాడేందుకు నిస్సాన్ మోటార్ ఇండియా నిరాకరించింది. తమిళనాడులోని ప్లాంట్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఏడాదికి 4.8 లక్షల యూనిట్ల ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ ప్లాంట్కు ఉంది.
ఇదిలా ఉంటే నిస్సాన్ ఇతర కార్ల తయారీ సంస్థల్లా కాకుండా ప్రపంచ మార్కెట్లో పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో దాని ప్రభావం కార్ల సేల్స్పై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్దం ఉత్పత్తికి పెద్ద అడ్డంకిగా మారింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో కొత్త నిబంధనలు రావడం మరో సవాలుగా ఈ సంస్థకు మారింది. వీటితో పాటు నిస్సాన్ సంస్థకు సొంత సమస్యలు ఉన్నాయి. అమెరికా, యూరప్ దేశాల్లో మార్కెట్లో నష్టాలను చవిచూస్తోంది. ఇక యూరోప్ దేశాల్లో రష్యాతో సహా నిస్సాన్ సేల్స్ ఒక త్రైమాసికంలో 16శాతం పడిపోయినట్లు సమాచారం.