జయకు వెంటిలేటర్ తొలగింపు: నీతా అంబానీ పరామర్శ
చెన్నై: తీవ్ర అనారోగ్యంతో గత 22 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. జయలలితకు వెంటిలేటర్ తొలగించారు. దీంతో ఆమె మెల్లగా కళ్లు తెరచి తన అవసరాల గురించి వైద్యులు, సహాయ సిబ్బందికి సైగలు చేస్తున్నట్లు తెలిసింది.
గురువారం ఉదయం ఆమె తనకు వార్తాపత్రిక కావాలని సైగ చేశారు. అయితే ఆమెకు ఇబ్బంది అవుతుందని వైద్యులు నిరాకరించినట్లు సమాచారం. జయలలితకు 'ట్రాకోస్టమీ'(గొంతుకు రంధ్రంచేసి గొట్టం ద్వారా చికిత్స)ని కనీసం మరో పది రోజుల పాటు కొనసాగించవచ్చని తెలిసింది. దానిని తొలగించాక ఆమె మాట్లాడే అవకాశం ఉంది.
వెంటిలేటర్ తొలగించడంతో మరో రెండు రోజుల్లో జయలలితను ప్రత్యేక గదికి కూడా తరలిస్తారని తెలిసింది. ఈ విషయాలపై అపోలో ఆస్పత్రి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మూడు రోజులుగా ఎలాంటి వైద్య నివేదికలు విడుదల కాలేదు. ఆమె నెమ్మదిగా కోలుకుంటున్నారన్న వార్తలు మాత్రం అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆనందం కలిగిస్తున్నాయి.
జయలలితకు అందిస్తున్న చికిత్స విధానాన్ని పర్యవేక్షించడానికి గురువారం మళ్లీ ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుడు ఖిల్నానీ వచ్చారు. ఆయన వూపిరితిత్తుల వ్యాధి నిపుణులు. జయలలితకు ఆస్తమా ఉండటం, వూపిరితిత్తుల్లో నెమ్ము చేరడంతో అందుకు చికిత్స చేస్తున్న అపోలో ప్రత్యేక వైద్యబృందానికి డాక్టర్ ఖిల్నానీ తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
మరోవైపు లండన్ వైద్యుడు రిచర్డ్ బాలే చెన్నైలోనే మకాం వేసి జయలలిత ఆరోగ్యాన్ని సమీక్షిస్తున్నారు. డా॥ప్రతాప్ సి.రెడ్డి ఆస్పత్రిలోనే ఉండి ఆమె ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జయలలిత త్వరగా కోలుకుని, తిరిగి పాలనాబాధ్యతలు చేపడతారని పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి చెప్పారు.
నీతా అంబానీ పరామర్శ
సీఎం జయలలితను రిలయన్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ గురువారం రాత్రి పరామర్శించారు. ఆమె యోగక్షేమాలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇతర నేతల పరామర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. జయలలిత ఆరోగ్యం విషయంలో ఆందోళనకు గురైన ఇద్దరు అభిమానులు ఆత్మహత్యకు పాల్పడటం విచారకరం.
కాగా, జయలలితను పరామర్శించడానికి తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య శుక్రవారం సాయంత్రం చెన్నైకి చేరుకుంటారని సమాచారం. ఇది ఇలా ఉండగా, సీఎం జయలలిత శాఖలన్నింటిని స్వీకరించిన మంత్రి పన్నీర్సెల్వం ఎక్కువ సమయం అపోలో ఆస్పత్రి వద్దే గడుపుతున్నారు.