హైకోర్టుకు నిత్యానంద క్షమాపణలు: అరెస్టు భయం, దెబ్బకు దిమ్మతిరిగింది, మదురై!
చెన్నై: వివాదాస్పద స్వామిజీ నిత్యానంద మంగళవారం తనను క్షమించాలని మద్రాసు హైకోర్టుకు మనవి చేశారు. 2,500 ఏళ్ల చరిత్ర ఉన్న మదురై మఠం 293వ ఆధీనం తానే అంటూ మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్ ను నిత్యానంద ఉపసంహరించుకున్నారు. గత వారం మద్రాసు హైకోర్టు నిత్యానందను అరెస్టు చేసి మంగళవారం కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చెయ్యడంతో నిత్యానంద వెనక్కి తగ్గి హైకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు.
సొంత ప్రకటన
మదురై మఠం 293వ ఆధీనం తానే అంటూ నిత్యానంద ఆయనకు ఆయనే ప్రకటించుకున్నారు. తరువాత మదురై మఠంలోకి నిత్యానంద, ఆయన శిష్యులు బలవంతంగా చొరబడటానికి ప్రయత్నించారు. ఈ విషయంపై అప్పట్లో పెద్దరాద్దాంతం జరిగింది.
తమిళనాడు ప్రభుత్వం
2,500 ఏళ్ల చరిత్ర ఉన్న మదురై ఆధీనంగా నిత్యానంత నియమకాన్ని వ్యతిరేకిస్తూ హిందూ, సంఘ సంస్థలు ఆందోళనకు దిగాయి. తమిళనాడు ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుంది. వివాదం పెద్దది కావడంతో నిత్యానంద నియమకాన్ని ప్రస్తుత ఆధీనం రద్దు చేశారు.
కోర్టులో పిటిషన్
మదురైకి చెందిన జగదల ప్రతాపన్ నిత్యానంద నియమకాన్ని రద్దు చెయ్యాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తానే మదురై మఠం 293వ ఆధీనం అంటూ నిత్యానంద మద్రాసు హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.
నకిలి పత్రాలతో కోర్టుకు
సంవత్సరం నుంచి విచారణ జరుగుతున్న ఈ పిటిషన్ ను గత వారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆర్. మాధవన్ విచారణ చేశారు. నిత్యానంద నకిలి పత్రాలతో కోర్టుకు సమర్పించి మోసం చెయ్యడానికి ప్రయత్నించాడని న్యాయమూర్తి గుర్తించారు.
హైకోర్టు ఆగ్రహం
సరైన పత్రాలు సమర్పించడానికి అవకాశం కావాలని నిత్యానంద న్యాయవాది కోర్టులో మనవి చేశారు. ఒక సంవత్సరం నుంచి విచారణ జరుగుతుంటే నిత్యానంద సరైన సమాధానం ఇవ్వడం లేదని, కోర్టులు అంటే తమాషాగా ఉందా అంటూ హైకోర్టు న్యాయమూర్తి ఆర్. మహదేవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్టు చెయ్యండి
నిత్యానందను అరెస్టు చేసి ఫిబ్రవరి 6వ తేది కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆర్. మహదేవన్ ఆదేశాలు జారీ చేశారు. కోర్టుకు సరైన సమాధానం చెప్పకుండా వ్యవహరిస్తున్నాడని, న్యాయస్థానం అంటే విలువలేదు అనే రీతిలో ప్రవర్థిస్తున్నారని న్యాయమూర్తి ఆర్. మహదేవన్ మండిపడ్డారు.
దెబ్బకు దిమ్మ తిరిగింది
హైకోర్టులో వాదనలు ఎప్పటికప్పుడు నిత్యానందకు మొబైల్ లో ఎస్ఎమ్ఎస్ లు ద్వారా పంపిస్తున్న ఆయన శిష్యుడిని గతవారం అరెస్టు చేసి మొబైల్ సీజ్ చేశారు. కోర్టు అంటే నిత్యానందకు, మీకు క్రీడామైదానాలుగా కనిపిస్తున్నాయా అంటూ హైకోర్టు న్యాయమూర్తి మహదేవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొబైల్ సీజ్ చేసి నిత్యానంద శిష్యుడిని అరెస్టు చెయ్యాలని న్యాయమూర్తి మహదేవన్ ఆదేశాలు జారీ చేశారు.
ఫలితం లేదు
మద్రాసు హైకోర్టు తీవ్రస్థాయిలో మందలించడంతో నిత్యానందకు దిమ్మతిరిగింది. ఇంతకాలం తానే మదురై మఠం ఆధీనం అంటూ వాదిస్తూవస్తున్న నిత్యానంద చివరికి మంగళవారం కోర్టులో క్షమాపణలు చెప్పి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు.