నిత్యానంద రేప్ కేసు: కోర్టు ముందు హాజరు
బెంగళూరు: తాను దేవుడినంటూ స్వయంగా ప్రకటించుకున్న బిడిది ధ్యానపీఠం ఆశ్రయం నిత్యానంద అలియాస్ నిత్యానంద స్వామి కేసు వాయిదా పడింది. అత్యాచారం, లైంగిక వేధింపులు చేశారనే ఆరోపణలపై నిత్యానంద మీద రామనగర జిల్లా కోర్టులో కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
బెంగళూరు నగరం సమీపంలోని బిడిది నిత్యానంద ఆశ్రమంలో గతంలో ఓ మహిళ నిత్యానంద భక్తురాలిగా అక్కడే ఉన్నారు. తరువాత ఆమె ఆశ్రయం నుండి బయటకు వచ్చేసింది. తను ఆశ్రమంలో ఉన్న సమయంలో నిత్యానంద తన మీద అత్యాచారం చేశాడని ఆరోపించింది.
అంతే కాకుండా నిత్యం లైంగిక వేధింపులకు గురి చెయ్యడం వలనే తాను ఆశ్రయం నుండి బయటకు వచ్చేశానని ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిత్యానందతో పాటు ఆయన శిష్యుల మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
శనివారం రామనగర జిల్లా కోర్టులో కేసు విచారణ జరిగింది. నిత్యానందతో పాటు ఆయన శిష్యులు ఐదుగురువిచారణకు హాజరైనారు. ఆ సందర్బంలో నిత్యానంద తరపు న్యాయవాది ముద్దు మల్లయ్య మాట్లాడుతూ హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నందున కేసు తీర్పు వాయిదా వెయ్యాలని న్యాయస్థానం ముందు మనవి చేశాడు. ఆగస్టు 1వ తేదికి కేసు వాయిదా పడింది.