నిత్యానంద ట్విస్ట్: పిల్లలకు పోర్నోగ్రాఫిక్ వీడియోలు.. పోలీసులతోపాటు 14మందిపై కేసు
అహ్మదాబాద్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. నిత్యానందపై నమోదైన అక్రమ నిర్బంధం కేసులో కోర్టు ఆదేశాల మేరకు 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కూడా ఉండటం గమనార్హం.
Recommended Video
నిత్యానందపై కేసు..
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లోని తన ఆశ్రమంలో ఇద్దరు అమ్మాయిలతోపాటు ఓ బాలుడిని అక్రమంగా నిర్బంధించి శారీరకంగా వేధించారని నిత్యానందపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిత్యానందతోపాటు శిశ్యురాళ్లుగా ఉన్న ఇద్దరు మహిళలపై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు.
చిన్నారులకు పోర్నోగ్రాఫిక్ వీడియోలు..
కాగా, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆశ్రమంలోని పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తించారని నిత్యానంద అనుచరుడు గిరీశ్ కోర్టును ఆశ్రయించాడు. చిన్నారులకు అధికారులు అసభ్యకరమైన(పోర్నోగ్రాఫిక్) వీడియోలు చూపిస్తూ వారిపై భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. అంతేగాక, వారిని అడగకూడదని ప్రశ్నలు అడుగుతున్నారని తన పిటిషన్లో పేర్కొన్నాడు.
పోలీసులతోపాటు 14మందిపై ఎఫ్ఐఆర్ నమోదు
పిటిషన్ పరిశీలించిన పోక్సో కోర్టు దర్యాప్తులో పాల్గొన్న పోలీసులతోపాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అహ్మదాబాద్ వివేకానందనగర్ పోలీసులు వెల్లడించారు. అంతేగాక, దర్యాప్తులో పాల్గొన్న పోలీసు అధికారుల వాంగ్మాలాలను సేకరించామని తెలిపారు.
ఆ దీవిలోనే..
కాగా, ప్రస్తుతం నిత్యానంత అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. తాను సొంతంగా ‘కైలాస' అనే దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు, దాన్ని ఒక దేశంగా గుర్తించాలని ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి కూడా నిత్యానంద విజ్ఞప్తి చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం నిత్యానంద ఆ దీవి(దేశం)లోనే తలదాచుకున్నట్లు తెలుస్తోంది. రంజిత వ్యవహారంతో నిత్యానందపై వివాదాస్పద గురువుగా ముద్రపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా పలు ఘటనలపై ఆయనపై కేసులు నమోదయ్యాయి.