పురుషత్వ పరీక్ష: కోర్టుకు నిత్యానంద స్వామి, 23న...
బెంగళూరు: లైంగిక ఆరోపణల కేసులో వివాదాస్పద నిత్యానంద స్వామి సోమవారం కర్నాటక రాజధాని బెంగళూరులోని రామనగర కోర్టుకు హాజరయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో నిత్యానంద కోర్టుకు వచ్చారు. నిత్యానంద పురుషత్వ పరీక్షల కేసు విచారణను కోర్టు ఆగస్టు 23వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న నిత్యానంద స్వామికి వైద్య పరీక్షల నిర్వహణ పైన సుప్రీం కోర్టు పదిహేను రోజుల క్రితం స్టే విధించిన విషయం తెలిసిందే. నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన సుప్రీం కోర్టు స్టే విధించింది. మరోవైపు, నిత్యానంద కేసు నాలుగేళ్లుగా నత్తనడకన సాగడం పైన నాడు సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిత్యానంద స్వామి ఆగస్టు ఆరున పురుషత్వ పరీక్షలకు హాజరు కావాలని కర్నాటక హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని రామనగర కోర్టు ఆదేశించింది.
\దీనిపై స్టే విధించాలని నిత్యానంద హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఆయనకు చుక్కెదురయింది. దీంతో అతను సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో నిత్యానందకు తాత్కాలిక ఊరట లభించింది. అయితే, సుప్రీం ఆదేశాల మేరకు అతను ఇప్పుడు రామనగర కోర్టు ఎదుట హాజరయ్యారు.