మరో వివాదంలో నిత్యానందస్వామి.. తిరువణ్ణామలై ఆశ్రమంలో పోలీసుల తనిఖీలు.. ఆ అమ్మాయే కారణం!!
ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకునే నిత్యానంద స్వామి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. నిత్యానంద ఆశ్రమంలో తన కుమార్తె ఉందని, తన కుమార్తెను వారి నుండి రక్షించాలని బెంగళూరుకు చెందిన దంపతులు చేసిన ఫిర్యాదుతో నిత్యానంద ఆశ్రమంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
నిత్యానంద ఆశ్రమంలో ఉండిపోయిన బెంగుళూరుకు చెందిన అమ్మాయి
బెంగళూరుకు చెందిన రిటైర్డ్ ఇంజనీర్ నగేష్, రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన అతని భార్య మాల, మరియు అతని ఇద్దరు కుమార్తెలు 2017లో బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమంలో చేరారు. అభిప్రాయ భేదాల కారణంగా నగేష్, అతని భార్య మాల మరియు పెద్ద కుమార్తె ఆశ్రమం నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. 2019లో వారు బయటకు వచ్చారు. అయితే వారి చిన్న కుమార్తె మాత్రం ఆశ్రమాన్ని వదిలి పెట్టనని తల్లిదండ్రులతో చెప్పి అక్కడే ఉండిపోయింది. దీంతో నగేష్, అతని భార్య మాల చిన్న కుమార్తె అక్కడ ఉండడంతో అప్పుడప్పుడు వెళ్ళి ఆమెను చూసి వస్తున్నారు.
ఆశ్రమానికి వెళ్ళినా కనిపించని కూతురు, పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
అయితే ఇటీవల చిన్న కుమార్తె వరూధిని ఆశ్రమంలో కలిసి ఆమెను ఎలాగైనా ఒప్పించి ఇంటికి తీసుకురావాలని నిత్యానంద ఆశ్రమానికి వెళ్ళిన తండ్రికి అక్కడ వరూధిని కనిపించలేదు. అక్కడ ఉన్న నిర్వాహకులను ప్రశ్నించగా వరూధిని అక్కడ లేదని తెలిపారు. ఎక్కడ ఉంది అన్న వివరాలను కూడా చెప్పకపోవడంతో వరూధిని తల్లిదండ్రులు తన కూతురిని నిత్యానంద ఆశ్రమం నుండి రక్షించాలని తమిళనాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
తిరువణ్ణామలై నిత్యానంద ఆశ్రమంలో పోలీసుల సోదాలు .. లభించని యువతి ఆచూకీ
తమ చిన్న కుమార్తెను నిత్యానంద స్వామిజీ మరియు అతని మద్దతుదారులు అక్రమంగా నిర్బంధించారని దంపతుల ఫిర్యాదుతో తిరువణ్ణామలై పట్టణంలోని స్వయం ప్రకటిత దైవం నిత్యానంద ఆశ్రమంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు . తనిఖీ సమయంలో దంపతులు, వారి పెద్ద కుమార్తె ఉన్నారు. అయితే, పోలీసుల బృందం ఆశ్రమంలో క్షుణ్ణంగా వెతికినా వారి చిన్న కుమార్తె ఆచూకీ లభించలేదు.
తమ కూతుర్ని రక్షించాలంటూ దంపతుల విజ్ఞప్తి
తమ కుమార్తెను రక్షించాలని కోరుతూ దంపతులు బెంగళూరు పోలీసులకుఫిర్యాదు చేశారు. ఆశ్రమ నిర్వాహకులు తమ కుమార్తెను తిరువణ్ణామలై తరలించారని తెలుసుకున్న క్రమంలో తిరువణ్ణామలై తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ పోలీసులు నిత్యానంద ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ ఆ అమ్మాయి జాడ లభించలేదు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.