‘జమిలి’ ఎన్నికలకు ‘ఉగ్ర’ ముప్పు: మోడీ సాకు
ఖర్చు, పాలన సజావుగా సాగేందుకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ప్రతిపాదిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందుకు ఒక సాకు చూపారు.
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఖర్చు, పాలన సజావుగా సాగేందుకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ప్రతిపాదిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందుకు ఒక సాకు చూపారు. దేశ సరిహద్దుల్లో భద్రతా విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్, పారా మిలిటరీ బలగాలు ఎన్నికల విధులకు వెళ్లడంతో శత్రువులు, జాతి వ్యతిరేకులు, ఉగ్రవాదుల ముప్పు నుంచి ఎదుర్కోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఆరు నెలల క్రితం అవినీతిని అంతమొందించేందుకు, నల్లధనాన్ని వెలికితీసేందుకు రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. అప్పుడూ ఉగ్రవాద ముప్పు నుంచి దేశాన్ని రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించి యావత్ భారతావనిని దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు బారులు తీరేలా చేశారు.
తాజాగా జమిలి ఎన్నికల నిర్వహణకు అదే ముప్పు పేరు చెప్పడం అంటే చిన్నప్పుడు బూచాడు వస్తాడని చూపి.. చిన్నారులను బుజ్జగించిన ఉదంతం గుర్తుకు వస్తున్నది. అంతే కాదు దేశ ప్రగతి, పరిపాలన సజావుగా సాగేందుకే లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహించాలన్న ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదనకు అనుగుణంగా అవసరమైన కార్యాచరణ రూపుదిద్దేందుకు 'నీతి ఆయోగ్' ముసాయిదా సిద్ధం చేసింది.
ఈ ముసాయిదాను గత నెల 23న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రవేశ పెట్టింది. తద్వారా 2024లో లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నది.
ప్రచారానికి పాలనలో ఇబ్బందుల తగ్గింపు లక్ష్యంగా..
పరిపాలనకు ఎన్నికల ప్రచారంతో ఇబ్బంది కలగకుండా దేశంలో అన్ని ఎన్నికలను ఒకేసారి స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలని తన మూడేళ్ల కార్యాచరణ ఎజెండా (2017-2020) ముసాయిదాలో పేర్కొంది. దేశ ప్రయోజనాల కోసం 2024 నుంచి రెండు దశల్లో జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించాలి. ఈ ప్రతిపాదన అమలు చేయడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును గరిష్టంగా ఒకసారి తగ్గించడం చేయడంగానీ, పొడిగించడం గానీ అవసరం అవుతుందని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది.
అందుకు అవసరమైన రాజ్యాంగ, చట్ట సవరణలకు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు చెబుతున్న నేపథ్యంలో 'నీతిఆయోగ్' సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ ఎన్నికల సంస్కరణలకు ఇదే సరైన తరుణమని, ఈ దిశగా నిర్మాణాత్మక చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఏక కాలంలో లోక్సభ, అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
నోడల్ ఏజెన్సీగా ఎన్నికల సంఘం
జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్న సూచనను పరిశీలించడంతోపాటు అందుకు సరైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని నోడల్ ఏజెన్సీగా నిర్ణయించిన కేంద్ర ఎన్నికల సంఘం.. రాజ్యాంగ పరంగా భాగస్వామ్య పక్షాలు, రాజ్యంగ నిపుణులు, మేధావులు, ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ అధ్యయన సంస్థలు, పార్టీల ప్రతినిధులతో వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసి, ఆరు నెలల్లోగా ముసాయిదా, వచ్చే మార్చి నాటికి తుది నివేదిక రూపొందించాలని సూచించింది.
ఈ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో జమిలి ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు, నిర్వహణా ఏర్పాట్లు, కమ్యూనికేషన్ల ప్రణాళికను వర్కింగ్ గ్రూప్ సిద్ధం చేస్తుందని ముసాయిదా పేర్కొంది. 'నీతిఆయోగ్' మూడేళ్ల ముసాయిదా ప్రణాళికలో భాగంగా ఈ కార్యాచరణను ముందుకు తీసుకొచ్చింది.
నిత్యం ఎన్నికలతో ప్రభుత్వ ఖజానాపై భారీ వ్యయం
జమిలి ఎన్నికల నిర్వహణతో కేంద్రంలోని అధికార బీజేపీతోపాటు అన్ని పార్టీలకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఎల్లవేళలా, ఎక్కడో ఒకచోట ఎన్నికల నిర్వహణతో ప్రభుత్వ ఖజానాపై భారీగా భారం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. 2009 లోక్ సభ ఎన్నికల నిర్వహణకు రూ.1100 కోట్లు ఖర్చయితే 2014 లోక్ సభ ఎన్నికల నాటికి అది రూ.4000 కోట్లకు చేరుకున్నది. నిత్యం ఎన్నికల ప్రక్రియ వల్ల ఉపాధ్యాయులు సహా కోటి మంది ప్రభుత్వోద్యోగులు పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడం వల్ల విద్యారంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న విమర్శలు ఉన్నాయి.