38 లక్షల ట్రాఫిక్ చలాన్లు.. రూ.577 కోట్ల జరిమానాలు.. వాహనదారులపై కొరడా
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటార్ వెహికిల్ యాక్ట్తో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని, గత ఏడాది సెప్టెంబర్- అక్టోబర్ పోల్చుకొంటే మెరుగైన పరిస్థితి కనిపించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్గరీ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నూతన మోటార్ యాక్ట్ 2019 ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 38 లక్షల చలాన్లు జారీ చేయగా.. రూ.577 కోట్ల ఆదాయం ఖజానాకు వచ్చిందని ఓ ప్రశ్నకు రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి గడ్కరీ రాతపూర్వక జవాబిచ్చారు.
ఎన్ఐసీ డేటాబేస్ ప్రకారం 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలుపుకొంటే.. ఇప్పటి వరకు 38,39,406 చలాన్లు జారీ చేయగా.. రూ.5,77,51,79,895 జరిమానా రూపంలో సమకూరిందని పేర్కొన్నారు.
వాస్తవానికి అన్ని రాష్ట్రాల నుంచి రెవెన్యూకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. కోర్టుకు సంబంధించిన చలాన్ల సమాచారం ఇంకా అందుబాటులోకి రాలేదు. పాండిచ్చేరిలో ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని, చత్తీస్గఢ్లో ప్రమాదాల శాతం పెరిగిందని వెల్లడించారు.
కొత్త మోటార్ వాహనాల చట్టం, 2019ని సెప్టెంబర్ 1వ తేదీన నుంచి కేంద్ర అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించిన వాహనదారులపై భారీ జరిమానాలతో కొరడా ఝలిపించింది. దాంతో నిబంధనలను పాటించడంతోపాటు సురక్షిత చర్యలను వాహనదారులు చేపట్టడం జరిగిందనే విషయం పలు సందర్భాల్లో వెల్లడైంది. కాగా, భారీ మొత్తంలో జరిమానాలు విధించడం కూడా ఈ చట్టంపై విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయకూడదని నిర్ణయించుకొన్న సంగతి కూడా తెలిసిందే.