పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గిస్తే సంక్షేమ పథకాలకు నిధులెలా?: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గిస్తే పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం ఇబ్బందయ్యే అవకాశం ఉందని కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల విలువైన సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.
పెట్రోలియం ఉత్పత్తులపై ధరలను తగ్గిస్తే సంక్షేమ పథకాలకు నిధులు ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇంకా కొన్ని కొత్త పథకాలకు కూడ శ్రీకారం చుడుతోందన్నారు. ఈ కారణాలతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గిస్తే నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదన్నారు.
అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా పెట్రోల్, డీజీల్ ధరలు దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజీల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు కూడ వినియోగదారుల జేబులకు చిల్లులు పడేలా చేస్తోంది.
ఈ తరుణంలో పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు పెట్రోల్, డీజీల్ లను కూడ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ కూడ పెరుగుతోంది.ఈ విషయాన్ని కూడ ఆలోచిస్తున్నట్టుగా గతంలో పలుమార్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు.
పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతున్న తరుణంలో తగ్గించాలని డిమాండ్ పెరుగుతోంది. రానున్న రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర సుమారు వంద రూపాయాల మార్క్ ను దాటే అవకాశం కూడ లేకపోలేదనే ప్రచారం సాగుతోంది.
అయితే ఈ సమయంలో పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గిస్తే సంక్షేమ పథకాలను అమలు చేయడానికి నిధులు ఎలా వస్తాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.
మనం ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్నాం. పెట్రోలు ధరలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ముడిపడివున్నాయి. ప్రజలకు ఊరట లభించేలా మనం 'పెట్రో' ఉత్పత్తులను చౌకగా విక్రయించాలంటే అధిక ధరలకు వాటిని కొని, సబ్సిడీ అందించాల్సిందేనని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. పెట్రోలుపై సబ్సిడీ అంటే, సంక్షేమ పథకాలకు వాడుతున్న డబ్బంతా ఆవిరైపోతుందన్నారు. సభ్సిడీ అందిస్తే, మనవద్ద అతికొద్ది మొత్తంలో మాత్రమే డబ్బుంటుందన్నారు.
ఇక పెట్రోలుపై పన్నులను తగ్గించినా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని, పేదలకు ఉచిత ఎల్పీజీని అందించే ఉజ్వలా స్కీమ్ తో పాటు, నీటి పారుదల పథకాలు, గ్రామీణ విద్యుదీకరణ పథకాలపై ప్రభావం పడుతుందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు.