హర్ధిక్ ఎఫెక్ట్: నితిన్ పటేల్కు అమిత్షా ఫోన్, ఒకే చెప్పిన డిప్యూటీ సీఎం
గాంధీనగర్: మంత్రి పదవుల కేటాయింపుల విషయంలో అసంతృప్తితో ఉన్న డిప్యూటీ సిఎం నితిన్ పటేల్ చల్లబడ్డారు.. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా జోక్యంతో నితిన్ పటేల్ శాంతించారు. మంత్రి పదవులను తీసుకొనేందుకు అంగీకరించారు.
ఆదివారం నాడు ఉదయం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనతో మాట్లాడారని నితిన్ పటేల్ చెప్పారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తనకు తగిన శాఖలు కేటాయిస్తామని హమీ ఇచ్చారని నితిన్ పటేల్ చెప్పారు.
గత ప్రభుత్వంలో నితిన్ పటేల్కు ఆర్థిక, పట్టణాభివృద్ది శాఖలను కేటాయించారు.అయితే ఈ దఫా మాత్రం విజయ్ రూపాని నితిన్కు ఆశించిన పదవులు ఇవ్వలేదు.దీంతో మంత్రి పదవులు చేపట్టకుండా నితిన్ పటేల్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అయితే పది మంది ఎమ్మెల్యేలను తీసుకొని బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీతో చర్చించి గౌరవ ప్రదమైన స్థానం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని హర్ధిక్ పటేల్ నితిన్ పటేల్కు శనివారం నాడు బంపర్ ఆఫర్ను ప్రకటించారు.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని నితిన్ పటేల్కు అమిత్షా ఫోన్ చేశారు.ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం గవర్నర్ ఓపీ కోహ్లిని కలిసి నాకు కేటాయించిన కొత్త శాఖకు సంబంధించిన లేఖను అందజేస్తారు' అని నితిన్ చెప్పారు.
రోడ్లు, భవనాలు, ఆరోగ్యం, వైద్యవిద్య, నర్మద, కల్పసార్, కేపిటల్ ప్రాజెక్టులు వంటి శాఖలు ఆయనకు అప్పగించారు. కీలకమైన ఆర్థిక శాఖను సౌరభ్ పటేల్కు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కేటాయించారు. పట్టణాభివృద్ధి శాఖను మాత్రం సీఎం తన వద్దే ఉంచుకున్నారు.
తనకు గౌరవప్రదమైన శాఖలు ఇవ్వాలనీ, లేదంటే కేబినెట్ నుంచి తప్పుకునేందుకు అనుమతించాలని కోరారు. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో తాను పార్టీ పట్ల విధేయత, క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా సేవలందిస్తానని నితిన్ మీడియాకు తెలిపారు.