చిరాగ్ వ్యూహమా... బీజేపీ లోపాయకారి ఒప్పందమా... బీహార్ ఓటర్లలో బిగ్ కన్ఫ్యూజన్...
బీహార్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ ఓటర్లు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ఈ గందరగోళానికి ప్రధాన కారణం చిరాగ్ పాశ్వాన్. ఎన్టీయే కూటమి నుంచి తప్పుకుని సొంతంగా పోటీ చేస్తున్నప్పటికీ... తాము ఇప్పటికీ బీజేపీ మిత్రపక్షమే అన్నట్లుగా వ్యవహరిస్తోంది లోక్ జనశక్తి పార్టీ. పైగా బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జేడీయూని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తోంది.
దీంతో ముఖ్యమంత్రి,జేడీయూ అధినేత నితీశ్కు చెక్ పెట్టేందుకు బీజేపీయే ఎల్జేపీని 'బీ' టీమ్గా బరిలో దింపిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. పైకి ఇరు పార్టీ నేతల ఈ ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ... చిరాగ్ పాశ్వాన్ చేస్తున్న ప్రకటనలు,ఆయన రాజకీయ వ్యవహార శైలి బీజేపీ ఓటర్లను గందరగోళానికి గురిచేస్తోంది. ఈ గందరగోళాన్ని మరింత పెంచేలా బీజేపీ ఓటర్లు సైతం ఎల్జేపీకే ఓటేయాలని తాజాగా చిరాగ్ పిలుపునివ్వడం గమనార్హం.
బీజేపీ ఓటర్లకు చిరాగ్ పిలుపు...
'#బీహార్ఫస్ట్బీహారీఫస్ట్ నినాదాన్ని నిజం చేయాలంటే మీరంతా ఎల్జేపీకే ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎల్జేపీ అభ్యర్థులు పోటీలో లేని చోట బీజేపీకి ఓటేయండి. రాబోయే ప్రభుత్వం నితీశ్ కుమార్ లేని ప్రభుత్వం...' అని చిరాగ్ పాశ్వాన్ ఆదివారం(అక్టోబర్ 25) ట్వీట్ చేశారు. ఎన్నికల తర్వాత బీజేపీ నితీశ్ను పక్కనపెట్టి.. ఎల్జేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అన్న సందేహాలకు ఊతమిచ్చేలా ఉంది చిరాగ్ ట్వీట్. బీజేపీ బీహార్లో సొంత ముఖ్యమంత్రిని కోరుకుంటోందన్న ప్రచారం జరుగుతున్న వేళ... చిరాగ్ చేస్తున్న ప్రకటనలు పరోక్షంగా దాన్ని బలపరుస్తున్నాయి.
బీజేపీ స్ట్రాటజీనా...
బీహార్ ఎన్నికల్లో ఎల్జేపీ సొంతంగా పోటీ చేయాలన్న నిర్ణయం చిరాగ్ పాశ్వాన్ తీసుకున్నదేనా... లేక దీని వెనకాల బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడ ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ ఎన్నికల్లో ఎల్జేపీ ప్రభావం చూపగలిగితే... ఫలితాల తర్వాత నితీశ్ జేడీయూని కాదని,చిరాగ్తో జతకట్టేందుకే బీజేపీ ఈ లోపాయకారి ఒప్పందం కుదర్చుకుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే గత లెక్కలను పరిగణలోకి తీసుకుంటే... ఎల్జేపీకి బీహార్లో అంతగా ఆదరణ లేదన్న విషయం స్పష్టమవుతోంది. కేవలం 4-6శాతం మాత్రమే ఉన్న పాశ్వాన్ కమ్యూనిటీ ఓటు బ్యాంకు తప్పితే.. ఆ పార్టీకి ఇతర ఓటు బ్యాంకు దాదాపుగా లేదనే చెప్పాలి. 2010 ఎన్నికల్లో కేవలం మూడు అసెంబ్లీ స్థానాలు,2015 ఎన్నికల్లో రెండు స్థానాలకే ఎల్జేపీ పరిమితమవడం ఇందుకు నిదర్శనం.
చిరాగ్ వ్యూహం...
కాబట్టి బీహార్లో అంతగా బలం లేని ఎల్జేపీతో బీజేపీ మాత్రం ఎందుకు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుంటుందన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. సొంత ఓటు బ్యాంకు పెద్దగా లేదు కాబట్టి మోదీ,బీజేపీ పట్ల పదేపదే అభిమానం చాటుకోవడం ద్వారా ఆ పార్టీ ఓట్లను ఎల్జేపీకి మళ్లించాలనే వ్యూహంలో చిరాగ్ ఉన్నారేమో అన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ ఈ వ్యూహం ఫలించి ఎల్జేపీ కొద్దో గొప్పో స్థానాలు సంపాదిస్తే... ఎటొచ్చి నితీశ్ కుమార్కు దెబ్బ తప్పితే బీజేపీకి పోయేదేమీ లేదు. ఎల్జేపీ కారణంగా బీజేపీ ఓట్లు జేడీయూకి పోల్ అవకపోతే నితీశ్కు గట్టి దెబ్బ తగిలినట్లే. అదే జరిగి.. జేడీయూకి గనుక సీట్లు తగ్గితే... ఎన్నికల తర్వాత బీజేపీ ఆ పార్టీని పక్కనపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి చిరాగ్ అనుసరిస్తున్న స్ట్రాటజీతో ఎటొచ్చి నితీశ్ కుమార్కే ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది.
తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటున్న నితీశ్...
అటు మహాకూటమి,ఇటు లోక్ జనశక్తి పార్టీ... ఈ రెండూ నితీశ్ పైనే యుద్దం చేస్తున్నాయి. నితీశ్కు ముఖ్యమంత్రిగా ఇవే చివరి రోజులు అని ప్రచారం చేస్తున్నాయి. 15 ఏళ్ల పాలనలో నితీశ్ బీహార్కు చేసిందేమీ లేదని.. నితీశ్కు వీడ్కోలు తప్పదని అంటున్నాయి. ఈ నేపథ్యంలో నితీశ్ ఈసారి తీవ్రమైన ప్రతికూలతను చవిచూస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఇంతటి ప్రతికూలతను సైతం ఎదుర్కొని జేడీయూ సత్తా చాటగలిగితే నితీశ్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. ఒకవేళ ఎన్నికల్లో జేడీయూ చతికిలపడితే మాత్రం... ఇక నితీశ్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 10న బీహార్ ఓటరు ఏ తీర్పు ఇవ్వబోతున్నాడన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.