నితీశ్ను చావుదెబ్బ కొట్టిన బీజేపీ... 'కుట్ర' నెరవేరింది... ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్కి పడిపోయాడంటే...
బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఫలితాలను గమనిస్తే... అటు బీజేపీ,ఇటు ఆర్జేడీ అంచనాలకు తగ్గట్లుగానే హోరాహోరీగా తలపడ్డాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల కంటే ఆర్జేడీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరగ్గా... మెజారిటీ దిశగా పయనిస్తున్నప్పటికీ బీజేపీ ఓటు బ్యాంకు కొంతమేర తగ్గింది. ఇక 2015లో 71 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న నితీశ్ కుమార్ జేడీయూ.. ఈసారి మాత్రం 40-50కే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ పన్నిన వలలో చిక్కుకుని నితీశ్ భారీగా నష్టపోయారన్న వాదన వినిపిస్తోంది. జేడీయూ బహిష్కృత నేత,నితీశ్ మాజీ సలహాదారు పవన్ వర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంతేకాదు,బీజేపీ కుట్రలు నితీశ్కు కూడా తెలుసునని బాంబ్ పేల్చారు.
Recommended Video
నితీశ్ శివసేనకు థ్యాంక్స్ చెప్పాలి... బీజేపీ మహారాష్ట్ర దెబ్బ మరువదు... సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..
బీజేపీ కుట్ర నెరవేరింది : పవన్ వర్మ
నితీశ్ కుమార్కు చెక్ పెట్టేందుకే బీజేపీ లోక్ జనశక్తి పార్టీని విడిగా బరిలో దించిందని పవన్ వర్మ పేర్కొన్నారు. బీహార్లో జేడీయూని రెండో స్థానానికి పరిమితం చేసి.. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించాలనుకుందన్నారు. తమ పార్టీకి చెందిన నేతనే సీఎంగా చూడాలనుకుందని... ఇప్పటి ఫలితాలు చూస్తుంటే... బీజేపీ కుట్ర నెరవేరినట్లే కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అంతేకాదు,ఈ కుట్ర సంగతి నితీశ్ కుమార్కు కూడా తెలుసునని పేర్కొన్నారు.
84 స్థానాల్లో గెలవాల్సింది... కానీ..
ఒకవేళ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ విడిగా బరిలో దిగి ఉండకపోతే... జేడీయూ 84 స్థానాల్లో గెలిచి ఉండేదని పవన్ వర్మ అంచనా వేశారు. బహుశా జేడీయూనే అతిపెద్ద పార్టీగా అవతరించి ఉండేదేమోనని అభిప్రాయపడ్డారు. కానీ చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ కారణంగా సీన్ తలకిందులైందని... బీహార్ ఎన్నికల్లో పాశ్వాన్ను ఎవరు ప్రయోగించారో నితీశ్కు తెలుసునని చెప్పారు. ఎన్నికల సమయంలో తాను నరేంద్ర మోదీకి హనుమాన్ లాంటి వాడినని చిరాగ్ ప్రకటించుకున్నారని పవన్ వర్మ గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీ చిరాగ్ను పల్తెత్తు మాట కూడా అనలేదన్నారు.
జేడీయూకి బదిలీ కాని బీజేపీ ఓట్లు..
చిరాగ్ పాశ్వాన్ కారణంగా చాలాచోట్ల బీజేపీ ఓట్లు జేడీయూకి బదిలీ కాలేదని పవన్ వర్మ పేర్కొన్నారు. అదే సమయంలో జేడీయూ ఓట్లు మాత్రం బీజేపీకి పోలయ్యాయని చెప్పారు. ఇప్పుడు నితీశ్ ముందు పెద్దగా ఆప్షన్స్ ఏమీ లేవని... ఆర్జేడీతో ఎలాగూ చేతులు కలపరని అన్నారు. ఒకవేళ ఆర్జేడీతో చేతులు కలిపితే తేజస్వి కింది స్థానంలో నితీశ్ ఉండాల్సి వస్తుందని... అందుకు ఆయన అంగీకరించరని తెలిపారు. ఒకవేళ మహాకూటమి ప్రభుత్వం ఏర్పడితే... జేడీయూ మూడో స్థానంలో నిలిచిన కారణంగా.. నితీశ్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. ఒకవేళ ఎన్డీయే గెలిచి మళ్లీ నితీశ్నే ముఖ్యమంత్రి చేసినా... ఈసారి ఆ పదవిలో కొనసాగడం అంత ఈజీ ఏమీ కాదన్నారు.
నితీశ్కు చావుదెబ్బ...
నిజానికి జాతీయ స్థాయి రాజకీయాల్లో సత్తా చాటగల సామర్థ్యం ఉన్న నితీశ్ను బిహార్కే పరిమితం చేసి... ఇప్పుడు బీహార్లోనూ ఆయన పార్టీని చిన్న పార్టీగా పరిమితం చేయడంలో బీజేపీ సక్సెస్ అయిందన్నారు. ఇప్పుడు నితీశ్ తన రాజకీయ ఉనికి కోసం బీజేపీపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. ఒకవేళ ఎన్డీయే తరుపున నితీశే మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టినా... ఈసారి ఆయనకు ఘోర అవమానాలు తప్పవన్నారు.