బీజేపీ అనూహ్య ఎత్తుగడ: జేడీయూతో 50:50 డీల్ - పాశ్వాన్ ఒంటరి పోరు - నితీశ్ వ్యతిరేక ఓట్లను చీల్చేలా
కరోనా విలయం, ఆర్థిక వ్యవస్థ పతనం తరువాత తొలిసారి జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఎత్తుగడను అమలు చేస్తున్నది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తుల విషయంలో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)కి ఒక్క సీటు కూడా పంచకుండా.. ఉద్దేశపూర్వంగా వెళ్లగొట్టింది. అదే సమయంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారధ్యంలోని జనతాదళ్ యునైటెడ్(జేడీయూ)తో సీట్ల సర్దుబాటును దాదాపుగా ఖరారు చేసింది..
చైనాలో కనీవినీ ఎరుగని దారుణం - ఒకేసారి 4వేల పెంపుడు జంతువులు బలి - తిండి, నీరు లేక..
50:50 ఫార్ములా..
మొత్తం 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో పోలింగ్ జరుగనుండగా, మొదటి దశలోని 71 సీట్లకు నామినేషన్ ప్రక్రియ ఈనెల 8తో ముగియనుంది. దీంతో ఇటు ఎన్డీఏ, అటు యూపీఏ సీట్ల సర్దుబాటును ఖరారు చేసుకున్నాయి. ఆదివారం తాజాగా వెల్లడైన సమాచారం మేరకు.. ఎన్డీఏ కూటమిలోని జేడీయూ, బీజేపీల మధ్య 50:50 ఫార్ములా అంగీకారం కుదిరింది. పేరుకు చెరి సగం సీట్లను పంచుకున్నామని చెబుతున్నా.. జేడీయూ మాత్రం 124 సీట్లలో పోటీ చేయనుండటం దాదాపు ఫైనలైజ్ అయింది. అయితే..
జేడీయూ కోటాలోనే ఎచ్ఎంఏ..
జేడీయూ పోటీ చేసే 124 సీట్లు పోగా, మిగిలిన 119 సీట్లలో బీజేపీ బరిలోకి దిగనుంది. కాగా, ఎన్డీఏ కూటమిలోని మరో పార్టీ, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎం)కు జేడీయూ కోటాలో సీట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎంఏ అభ్యర్థులందరూ జేడీయూ బీఫారంతో, ఆ పార్టీ ఎన్నికల గుర్తుపైనే పోరాడుతారని తెలుస్తోంది. హెచ్ఎంఏకు ఐదు సీట్లు పోగా జేడీయూ, బీజేపీలు తలో 119 సీట్లతో పోటీచేసినట్లవుతుంది. అయితే, సుదీర్ఘకాలంగా ఎన్డీఏలో కొనసాగుతోన్న ఎల్జేపీ పార్టీ ఈ సారి బీహార్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు రెడీ కావడం గమనార్హం.
ఎల్జేపీ రూటు సపరేటు..
బీహార్ లో దళిత ఓటు బ్యాంకు బలంగా ఉన్న ఎల్జేపీ పార్టీ సుదీర్ఘకాలంగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామిగా కొనసాగుతున్నది. అయితే, ఎన్నికలు ప్రారంభం కాకముందు నుంచే ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్.. బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై విమర్శలు సంధిస్తూ వస్తున్నారు. జేడీయూతో సమానంగా ఎల్జేపీకి టికెట్లు ఇవ్వాలని, లేకుంటే ఒంటరి పోరుకు దిగుతామని పాశ్వాన్ హెచ్చరించారు. ఆదివారం నాటి సీట్ల సర్దుబాటులో కేవలం జేడీయూ, బీజేపీలు మాత్రమే ఒప్పందం కుదుర్చుకుని, ఎల్జేపీని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో పాశ్వాన్ పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమైంది.
నిన్న సబ్బంహరి, ఇవాళ పట్టాభి - టీడీపీ అధికార ప్రతినిధి కారు ధ్వంసం - హైకోర్టు జడ్జి ఇంటి పక్కనే ఘటన
ఇదే ఎత్తుగడ..
బీహార్ లో కరోనా నియంత్రణ, వరదల సమయంలో నిరాశ్రయులను ఆదుకోవడంలో నితీశ్ కుమార్ దారుణంగా ఫెయిలయ్యారనే భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు గణనీయంగా ఉండొచ్చని ఎన్డీఏ అంచనా వేస్తున్నది. నితీశ్ వ్యతిరేక ఓట్లు నేరుగా ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే పాశ్వాన్ పార్టీ(ఎల్జేపీ)ని ఒటరిగా బరిలోకి దించుతున్నారు. తాము ఎన్డీఏ నుంచి విడిపోవడం లేదని, బీజేపీకి నీడలా వ్యవహరిస్తామని ఎల్జేపీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రభావితం చూపుతాయనుకున్న 143 స్థానాల్లో ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేయనున్నది. ‘‘మోదీతో శతృత్వం లేదు.. కానీ నితీశ్ ను భరించలేం'' అనే నినాదంతో ఎల్జేపీ ప్రచారం చేయనుంది.
Recommended Video
అభ్యర్థులు ఖరారు ఇలా..
243 సీట్లున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. తొలి దశ నామినేషన్ల పూర్తికి ఇంకా నాలుగు రోజుల సమయమే ఉండటంతో ఆదివారమే అభ్యర్థుల్ని ప్రకటించాలని బీజేపీ, జేడీఎస్ నిర్ణయించుకున్నాయి. బీజేపీ సెంట్రన్ ఎలక్షన్ కమిటీ ఇంకాసేపట్లో బీహార్ క్యాండిడేట్ల జాబితాను విడుదల చేయనుంది. ఇకపోతే, తేజస్వీ యాదవ్ నాయకత్వంలోని యూపీఏ కూటమిలో.. ఆర్జేడీ 145 సీట్లు, కాంగ్రెస్ 68, సీపీఐ(ఎంఎల్) 19 సీట్లు, సీపీఐ, సీపీఎం కలిసి 10 స్థానాల్లో పోటీకి దిగనున్నాయి.