బడా వ్యాపారుల నుండి రుణాలను ఎందుకు వసూలు చేయరు: నితీష్
పాట్నా: బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పెద్ద నోట్లు రద్దును బ్యాంకులు సక్రమంగా అమలు చేయలేకపోయాయన్నారు. డీమానిటైజేషన్ ప్రయోజనాలు ప్రజలు పొందేకపోయారని ఆయన చెప్పారు.
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకుల్లో ఇటీవల వేలాది కోట్ల కుంభకోణాలు చోటు చేసుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు.
బ్యాంకుల నుండి వేలాది కోట్లు రుణాలు తీసుకొని విదేశాలకు తరలిపోతున్నారని ఆయన గుర్తు చేశారు. పెద్ద పెద్ద వ్యాపారులు బ్యాంకులను మోసం చేసి విదేశాలకు తరలిపోతోంటే పేదోళ్ళు మాత్రం కఠినంగా బ్యాంకులను రుణాలను చెల్లించాల్సి వస్తోందని ఆయన చెప్పారు.
చిన్న చిన్న వ్యాపారులపై బ్యాంకులు కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. బడా వ్యాపారుల నుండి బకాయిలు వసూలు చేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన ప్రశ్నించారు.
డీమానిటైజేషన్ కు తాను మద్దతు ప్రకటించినట్టు చెప్పారు. డీమానిటైజేషన్ వల్ల ఆశించిన ప్రయోజనం పొందకపోవడానికి బ్యాంకులే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు డబ్బులు డిపాజిట్ చేసుకొంటే బడా వ్యాపారస్తులు రుణాల రూపంలో డబ్బులను తీసుకొని వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోయారని ఆయన చెప్పారు.