తండ్రిలేని బిడ్డకు నితీశ్ అన్యాయం- చిరాగ్ పాశ్వాన్కు మద్దతుగా తేజస్వీ యాదవ్
బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. బీహార్లో ఎన్డీయేలో ఉంటూ తాజాగా బయటకి వచ్చి జేడీయూపై పోరుకు దిగిన లోక్జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ సీఎం నితీశ్ కుమార్పై నిత్యం విమర్శలకు దిగుతున్నారు. వాటికి చిరాగ్ కూడా అంతే దీటుగా బదులిస్తున్నారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతుండగానే లోక్ జనశక్తి అధినేత, చిరాగ్ తండ్రి రాం విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు.
రాం విలాస్ పాశ్వాన్ మృతికి ముందు బీహార్లో జేడీయూపై తమ పోటీకి దింపిన లోక్జనశక్తి పార్టీ ఇప్పుడు మారిన పరిస్ధితుల్లో వారిని గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అధికార పార్టీ అయిన జేడీయూను ఎదుర్కొంటూ ఎల్జేపీ అభ్యర్ధులను గెలిపించుకోవడం అధినేత చిరాగ్ పాశ్వాన్కు తలనొప్పిగా మారింది. దీంతో ఆయన పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ సీఎం నితీశ్ కుమార్ తండ్రిలేని కొడుకు చిరాగ్కు అన్యాయం చేస్తున్నారంటూ ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు.
చిరాగ్ పాశ్వాన్ విషయంలో నితీశ్ తీరు సరికాదు. కానీ ఇప్పుడు చిరాగ్ తండ్రి రాం విలాస్ పాశ్వాన్ మన మధ్య లేరు. తండ్రి దగ్గరుండాల్సిన సమయంలో లేకపోగా.. అండగా నిలవాల్సిన నితీశ్ కుమార్ ఆయన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ తేజస్వీ వ్యాఖ్యానించారు. దీంతో పాశ్వాన్కు మద్దతుగా సెంటిమెంట్ రగల్చడం ద్వారా ఆర్జేడీ నేత తేజస్వీ... నితీశ్ను టార్గెట్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది.