నితీష్పై ఎమ్మెల్యే తిరుగుబాటు?: విశ్వాస పరీక్ష కత్తిమీద సామే...
నితీశ్కుమార్ రాత్రికిరాత్రే ప్లేటు మార్చడం పై యునైటెడ్ జనతాదళ్ (జేడీయూ) లో నిరసనలు భగ్గుమన్నాయి.11మంది యాదవ్ ఎమ్మెల్యేలు, ఐదుగురు ముస్లిం ఎమ్మెల్యేలు బీజేపీతో పొత్తుపై మండిపడుతున్నట్టు సమాచారం.
న్యూఢిల్లీ : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ రాత్రికిరాత్రే ప్లేటు మార్చడం పై ఆయన నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ జనతాదళ్ (జేడీయూ) లో నిరసనలు భగ్గుమన్నాయి. 11మంది యాదవ్ ఎమ్మెల్యేలు, ఐదుగురు ముస్లిం ఎమ్మెల్యేలు బీజేపీతో పొత్తుపై మండిపడుతున్నట్టు సమాచారం. అసమ్మతి ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగ్లో ప్రతికూల పాత్ర పోషించే అవకాశం ఉన్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
243 స్థానాలు గల బీహార్ అసెంబ్లీలో కనీస మెజారిటీకి 122 స్థానాలు అవసరం. 71 మంది సభ్యులు గల జేడీయూకు 53 మంది సభ్యులు గల బీజేపీ మద్దతునిస్తున్నది. శుక్రవారం నాడే అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కోవాలని నితీశ్కుమార్ను గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి ఆదేశించారు.
ఈ నేపథ్యంలో నితీశ్ నిర్ణయం పట్ల వ్యతిరేకత గల సొంత పార్టీ ఎమ్మెల్యేలు బాసటగా నిలుస్తారా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరికొందరు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని జేడీయూ నేతలు చెప్తున్నారు. ఓ ఎనిమిది మంది ఇతర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
ఆర్జేడీలోనూ జేడీయూ మద్దతుదారులు?
కూడికలు, తీసివేతల ప్రకారం నితీశ్ ప్రభుత్వానికి 132 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే నితీశ్కు సాధారణ మెజారిటీ కంటే ఎక్కువే సభ్యులున్నట్టు కనిపిస్తున్నప్పటికీ అసమ్మతి సెగతో అసెంబ్లీలో నెగ్గడం అంత సులభం కాకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఓ పిడికెడు మంది ఎమ్మెల్యేలు గీత దాటితే నితీశ్ విశ్వాస తీర్మానం వీగిపోయే ప్రమాదం ఉంది. అయితే 24 గంటల తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్లో ఒకింత నిరుత్సాహం ఏర్పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ అవసరాల రీత్యా లాలూ తన కుమారుడు తేజస్వి యాదవ్తో రాజీనామా చేయించి ఉంటే బాగుండేదని ఆర్జేడీ ఎమ్మెల్యేలు అన్నట్లు తెలుస్తున్నది. వారిలో కొందరు జేడీయూ అధ్యక్షుడు - బీహార్ సీఎం నితీశ్ కుమార్తో జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.
Recommended Video
ప్రమాణ స్వీకారానికి దూరంగా జేడీయూ మాజీ చీఫ్
బీజేపీతో నితీశ్ కుమార్ దోస్తీ జేడీయూలో చిచ్చు రాజేసింది. ప్రజాతీర్పునకు భిన్నంగా.. బీహారీ ప్రయోజనాల పేరిట బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై జేడీయూలో ఒక వర్గం తీవ్ర అసంతృప్తిగా ఉంది. ఇప్పటికే ఇద్దరు జేడీయూ ఎంపీలు బహిరంగంగా నితీశ్ తీరును తప్పుపట్టగా... పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్ కూడా గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ రెండుగా చీలనున్నదనే ఊహాగానాలు జోరందుకున్నాయి. బుధవారం రాత్రి నుంచి చోటుచేసుకున్న పరిణామాలపై జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఇంతవరకూ నోరు మెదపకపోవడంపై పలు వాదనలు విన్పిస్తున్నాయి. బీహార్లో మహాకూటమి కొనసాగాలనేదే యాదవ్ అభిమతమని, నితీశ్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
కావాలనే నితీశ్ ప్రమాణస్వీకారానికి యాదవ్ గైర్హాజరైనట్లు భావిస్తున్నారు. అదే సమయంలో రాహుల్తో ఆయన భేటీ కావడం చర్చనీయాంశమైంది. బీజేపీతో పొత్తు అంశాన్ని పార్టీలో కనీసం చర్చించలేదని, శరద్ యాదవ్ అభిప్రాయాన్ని అడగలేదని భేటీలో పాల్గొన్న జేడీయూ ఎంపీ అన్వర్ అలీ చెప్పారు. అన్వర్తో పాటు జేడీయూ కేరళ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ వీరేంద్ర కుమార్ కూడా నితీశ్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. తాను షాక్కు గురయ్యాయనని, కేరళ విభాగం ఎట్టి పరిస్థితుల్లోను ఎన్డీఏతో జట్టుకట్టదని చెప్పారు. మహారాష్ట్రలో ఏకైక జేడీయూ ఎమ్మెల్సీ కపిల్ పాటిల్ స్పందిస్తూ.. బీజేపీతో కలిసేందుకు నితీశ్ తొందర తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ నిర్ణయంతో ఎంతో బాధపడ్డామని.. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు.
2015 అవమానం మర్చిపోలేమంటున్న కమలనాథులు
నాలుగేళ్ల తర్వాత తిరిగి తమతో జత కలిసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యవహార శైలి పట్ల కమలనాథులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నితీశ్ కుమార్ను తమకు సహజ సిద్ధమైన రాజకీయ మిత్రపక్షంగా పరిగణించడం లేదని బీజేపీ నేత ఒకరు అంటున్నారు. 2013లో ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించిన తర్వాత ఎన్డీయే నుంచి నితీశ్ కుమార్ బయటకు వచ్చిన సంగతి గుర్తుచేస్తున్నారు. తర్వాత 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని మోదీని పరాభవించిన సంగతి విస్మరించరానిదని అభిప్రాయ పడుతున్నారు.
బీహార్ ఎన్డీయే ఖాతాలో చేరిపోవడంతో జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసే అంశానికి తాత్కాలికంగానే తెర పడుతుందని కమలనాథులు ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఎన్డీయేలో నితీశ్ కుమార్ చేరిక పట్ల కొందరు బీజేపీ నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. ఇదంతా పూర్తిగా అవకాశ వాద రాజకీయమని బీజేపీ సీనియర్ ఎంపి హుకుందేవ్ నారాయణ్ యాదవ్ వ్యాఖ్యానించారు. బీహార్ తమ చేతికి చిక్కడంపై బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తిగా సంతోషంలో మునిగితేలుతోంది. అయితే 2015లో తమను ఓడించినందుకు స్వీట్ రివేంజ్ తీర్చుకున్నట్లయిందని కూడా ఆ పార్టీ భావిస్తోంది.
భవిష్యత్లో జేడీయూ బలహీన పడుతుందన్న అంచనాలు
2015లో అవమాన భారంతో కూడిన ఓటమి తర్వాత మళ్లీ నితీశ్ కుమార్తో జత కట్టడం అంత మంచిది కాదని కేంద్ర మాజీ మంత్రి ఒకరు అభిప్రాయ పడ్డారు. భవిష్యత్లో సమస్యలు తలెత్తవచ్చునని మరో ఎంపీ వ్యాఖ్యానించారు. నితీశ్ కుమార్ తన నిజ రూపాన్ని బయట పెట్టుకున్నారని ఆ నేత చెప్పారు. కనీసం ముగ్గురు బీజేపీ ఎంపీలు మాత్రం జేడీయూతో పొత్తును వ్యతిరేకిస్తున్నారని తెలుస్తున్నది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భవిష్యత్లో జేడీయూ బలహీన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయ పడుతున్నారు.