గెలుపు: నితీశ్ ఫస్ట్ ఫోన్ ఎవరికి వెళ్లిందో తెలుసా?
పాట్నా: వరుసగా మూడోసారి బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నితీశ్ కుమార్ తన విజయం అనంతరం తొలిసారి ఎవరిని పలకరించారో తెలుసా? మాహాకూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనుకొంటున్నారా?
లేదా అదే కూటమిలో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అనుకొంటున్నారా? వీరెవరు కాదు. బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ నేత ఎల్కే అద్వానీని నితీశ్ ముందుగా ఫోన్ చేసి పలకరించారు. ఆదివారంతో ఎల్కే అద్వానీ 88వ పడిలో అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా నితీశ్కుమార్ అద్వానీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నితీశ్ ఫోన్ చేసే సమయానికి బీహార్ ఓట్ల లెక్కింపులో మహాకూటమి ముందంజలో ఉండటంతో అద్వానీ నితీశ్ను అభినందించారు. ‘మంచి విజయం అందుకొన్నారు' అని మెచ్చుకొన్నారు.
బీహార్ లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తంగా ఐదు దశల్లో జరిగిన బీహార్ ఎన్నికల్లో అత్యధికంగా 56.8 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో మొత్తం 3450 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆదివారం ఓట్ల లెక్కింపులో మహా కూటమి 178 స్థానాల్లో విజయం సాధించగా, ఎన్డీఏకు 58 స్థానాలు మాత్రమే దక్కాయి.
14 జిల్లాల్లో బీజేపీ అసలు ఖాతానే తెరవలేదు. ఎన్నికల ఫలితాల వివరాలు పార్టీల వారీగా చూస్తే
జేడీయూ- 71, ఆర్జేడీ-80, కాంగ్రెస్-27, బీజేపీ-53, ఎల్జేపీ -2, ఆర్ఎల్ఎస్పీ-2, హెచ్ఏఎం- 1, ఇతరులు-7.