ఇంకో రెండేళ్లే- సీఎంకు అన్నీ తెలుసు- ప్రశాంత్ కిశోర్ సంచలన స్టేట్మెంట్
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన బిహార్ లో జన్ సురాజ్ పేరుతో పాదయాత్ర సాగిస్తోన్నారు. గ్రామస్థాయిలో ప్రజలను కలుసుకుంటోన్నారు.
పాట్నా: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన బిహార్ లో జన్ సురాజ్ పాదయాత్ర సాగిస్తోన్నారు. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన ఆరంభమైన ఈ పాదయాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలను సైతం ఆయన పలకరిస్తోన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమౌతోన్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయాలపై తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తోన్నారు.
వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా..
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనుక ఉండి నడిపించారు ప్రశాంత్ కిశోర్. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో ఘన విజయం సాధించడానికి అవసరమైన వ్యూహాలను వేసింది ఆయన సారథ్యంలోని ఐప్యాక్ టీమ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడాయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్ జిల్లాలోని భితిహర్వా గాంధీ ఆశ్రమం నుంచి పాదయాత్రను ప్రారంభించారు.
అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా..
దేశంలోనే అత్యంత నిరుపేద, వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న బిహార్లో మార్పును తీసుకుని రావాలనేది తన ఉద్దేశమంటూ ప్రశాంత్ కిశోర్ అప్పట్లో ప్రకటించారు. తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. ఈ లక్ష్యం కోసమే తాను అడుగులు వేస్తోన్నానని వివరించారు. 12 నుంచి 15 నెలల్లో బిహార్లోని అన్ని గ్రామాలు, పట్టణాలను పలకరించేలా ఈ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రిపై..
తాజాగా ఆయన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2025 ఎన్నికల తరువాత ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉండబోరని, తాను మళ్లీ ముఖ్యమంత్రినికాలేననే విషయం ఆయనకు తెలుసనీ పేర్కొన్నారు. అందుకే- రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేరును ప్రతిపాదించారని వివరించారు. తేజస్వి యాదవ్ పేరును ప్రతిపాదించడం వల్ల రాష్ట్రీయ జనతాదళ్ ఓటుబ్యాంకును ఆకర్షించవచ్చనేది ఆయన వ్యూహమని చెప్పారు.
యాదవుల పాలనలో..
యాదవుల పరి పాలనలో బిహార్ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారని, గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండట్లేదనే విషయం పాదయాత్రలో తేటతెల్లమౌతోందని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటోన్నారని, ఆ మార్పును తీసుకుని రావడమే తన లక్ష్యమని అన్నారు. తన కంటే గొప్పవాడు అధికారంలోకి రావడం నితీష్ కుమార్ ఏ మాత్రం ఇష్టం లేని వ్యవహారమని విమర్శించారు.
మహాకూటమి గురించి..
మహాకూటమి గురించి నితీష్ కుమార్ అందరికంటే ముందుగా తననే సంప్రదించారని ప్రశాంత్ కిశోర్ చెప్పుకొచ్చారు. 2022 మార్చిలో ఢిల్లీలో తన వద్ద ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారని, ఇందులో చేరాలని కోరినట్లు చెప్పారు. బీజేపీతో పొత్తు కొనసాగిస్తే, 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత తనను ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించి- సొంత పార్టీ నాయకుడిని కూర్చోబెడుతుందనే విషయం నితీష్ కుమార్ కు తెలుసని, అందుకే మహాకూటమిని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు.