‘భయ్యా దూజ్’ రోజే సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో ఆ పార్టీ సీఎం అభ్యర్తి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైతే అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. దీపావళి పండగ తర్వాతనే బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీష్ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది.
అయితే, నవంబర్ 16న నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సంబంధిత పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. భయ్యా దూజ్ పండగ రోజే నితీష్ సీఎంగా ప్రమాణం చేస్తారని చెబుతున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలను, జేడీయూ నేతలను కలిసి నితీష్ ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటారని తెలిపాయి.
కాగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని రాజ్భవన్ వర్గాలు పేర్కొన్నాయి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయాల్సిన నితీష్ కుమార్ మొదట తన రాజీనామా లేఖను గవర్నర్కు అందజేయాల్సి ఉంటుంది.
కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ ఎమ్మెల్యేలంతా తమ నాయకుడిగా నితీష్ కుమార్ను ఎన్నుకోవాల్సి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బీజేపీ నేతలంతా నితీష్ కుమార్ ఎన్డీఏ సీఎం అని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హెచ్ఆర్ శ్రీనివాస్ .. గవర్నర్ ఫాగు చౌహాన్కు అందించారు.